యనమల రామకృష్ణుడు...తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నేత. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మినబంటు. చంద్రబాబు విమర్శలు ఎదుర్కొనే రాజకీయ వెన్నుపోటులో...టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను గద్దె దించేందుకు అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన అతికొద్దిమందిలో ఆయన ఒకరు. కాబట్టి సహజంగానే ఆయనకు చంద్రబాబు పెద్దపీట వేస్తారు. అలాంటి వ్యక్తిని కూడా...ఓ దఫా చినబాబు కెలికారని ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీలో లోకేష్ అజమాయిషీని అంగీకరించని వారి జాబితా పెద్దదే ఉందంటారు విశ్లేషకులు. చినబాబు పార్టీలో అరంగేట్రం, ప్రత్యేకంగా కోటరీ ఏర్పాటు చేసుకోవడంతో భగ్గుమన్న నేతలు... రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఈ టీం వ్యవహరించిన తీరుతో విసిగిపోయారట. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే టాక్ కూడా ఉంది. చివరకు...పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆప్తుడనే పేరొందిన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా చినబాబు తీరుతో విసిగిపోయారంటారు. ఈయన లాంటి ఎంతో మంది సీనియర్లు చినబాబు తీరు గురించి బాబోరికి చెప్పుకోలేక చివరకు బాబుకే దూరం జరిగారంటారు.
ఇక యనమల విషయానికి వస్తే.... 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం మీడియా లైజెనింగ్ ఆఫీసర్ల పేరుతో ఓ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అందరు మంత్రుల దగ్గర టీడీపీ ముఖ్యులు చెప్పిన వారే మీడియా బాధ్యతలు చూస్తారు. అయితే, ఇది పైకి కనిపించడం వరకే. అసలు విషయం...ఆ మంత్రులపై నిఘా పెట్టి...వారి వివరాలన్నీ పార్టీ పెద్దలకు చేరవేయాలనే బాధ్యతను వారికి అప్పగించారట. ఈ టీంకు నాయకత్వం వహించేది ఎవరయ్యా అంటే...నారా లోకేష్...దీంతో కొందరు మంత్రులు ఇబ్బంది పడ్డారు. కానీ మూసుకొని ఉండిపోయారు. అయితే యనమల మాత్రం తన శాఖకు పంపించిన వ్యక్తిని తిప్పిపంపించారట. అలా యనమల వంటి సీనియర్ నేతనే లోకేష్ టచ్ చేశారనే టాక్ ఉంది. ఇలాంటి పరిణామాలతో...టీడీపీ చీలిపోనుందా? అనే చర్చ సైతం జరుగుతుంది.