స్కూల్‌కు వెళ్లే వయసులో ఓ యువకుడిని ప్రేమించింది ఆ బాలిక... అనుకోకుండా మరో వ్యక్తి  చేతిలో అత్యాచారానికి గురైంది. విషయం బయటివారికి చెబితే పరువు పోతుందమోనన్న భయంతో... ప్రేమించిన వాడికే  చెప్పింది. అండగా నిలవాల్సిన యువకుడు.... బాలికను చావమంటూ సలహా ఇచ్చాడు. అంతేకాదు.. ఏకంగా పురుగుల మందు తెచ్చిచ్చాడు... అవమాన భారం భరించలేక ఆ బాలిక ప్రాణాలు తీసుకుంది. 

 

పశ్చిమగోదావరి జిల్లా బొర్రపాలెంలో మైనర్‌ బాలిక సూసైడ్ ఘటనలో అసలు విషయాలు నెమ్మదిగా  బయటకు వస్తున్నాయి. ప్రేమో, ఆకర్షణో తెలియని వయసులో ఓ యువకుడికి మనసిచ్చింది . ఆ యువకుడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇంతలో ఆ మైనర్‌ జీవితంలో ఘోరం జరిగింది. మైనర్‌పై కన్నేసిన రాజు అనే వ్యక్తి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో తెలియక మైనర్‌ బాలిక.. తల్లడిల్లిపోయింది.


విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పుకుందామంటే, మంచాన పడిన తల్లి పరిస్థితి చూసి నోరు విప్పలేకపోయింది. బంధువులకు తెలిస్తే.. నలుగురిలో తల ఒంపులు తప్పవని ఆందోళన చెందింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రియుడు, స్నేహితుడైన సుబ్రహ్మణ్యం గుర్తొచ్చాడు. అతనికి విషయం చెబితే అండగా ఉంటాడని తలచింది. నేరుగా విషయాన్ని ఆ యువకుడికి చెప్పింది. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి.


 
విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం.. అత్యాచారానికి గురైన నిన్ను ప్రేమించలేనని తెగేసి చెప్పాడు. అంతటితో ఆగితే బాగుండేదేమో.. కానీ ఏకంగా చావమని సలహా ఇచ్చాడు. చనిపోయేందుకు పురుగుమందు డబ్బు కూడా తెచ్చిచ్చాడు. జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ బాలిక కూల్‌ డ్రింక్ లో పురుగుమందు కలుపుకుని తాగింది. ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లింది. అక్కడే కళ్లు తిరిగిపడిపోవడంతో స్కూల్ టీచర్.. తల్లికి సమాచారమిచ్చారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా మారడంతో జంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స బాలిక చివరికి ప్రాణాలు విడిచింది. తల్లి, కుటుంబసభ్యులు పదే పదే ప్రశ్నించడంతో జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది. రాజు అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని అందుకే సూసైడ్ చేసుకున్నట్లు తెలిపింది. తాను తాగిన పురుగుల మందును సుబ్రహ్మణ్యం తీసుకువచ్చి ఇచ్చినట్లుగా వివరించింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఒక్కసారిగా గా షాక్ కు గురయ్యారు‌  సుబ్రమణ్యాన్ని నిలదీస్తే రాజు అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసిన విషయాన్ని, బాలిక చనిపోయేందుకు అవసరమైన పురుగుల మందుని అందించినట్టుగా ఒప్పుకున్నాడు. 


 
బాలిక మృతితో షాక్ కి గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను రేప్ చేసిన రాజుతో పాటు ఆమె మరణానికి కారణంగా భావిస్తున్న సుబ్రమణ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఓ కీచకుడు, మరో దుర్మార్గుడి చేష్టలకు విద్యార్థిని బలైపోవడంపై.. స్కూల్ టీచర్లు, విద్యార్థులు కంటతడిపెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై అత్యాచారం జరిగిన ఘటనను ఆ మైనర్ బాలిక.. ధైర్యంగా ఇంటిలోవారికి, కుటుంబసభ్యులకు చెప్పి ఉంటే.. ఈపరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి..  సూసైడ్ చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: