నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంతవరకు ఏకపక్షంగా పాలిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేశారు. సినిమాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న ఆయన.. పార్టీ ఏర్పాటు చేసి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు లోక్ సభలో42 స్థానాలకు గాను 35 గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1988లో పార్టీ ఓడిపోయింది. మళ్లీ 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదుపరి టీడీపీలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో 1995లో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీని చంద్రబాబునాయుడే ఏలుతున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసులు చాలామందే పార్టీకి సేవలు అందించారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి, తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, తనయ సుహాసిని.. ఇలా అందరూ పార్టీ కోసం పనిచేశారు. అయితే.. ఇందులో ఎవ్వరికీ కలిసిరాలేదనే చెప్పాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హరికృష్ణ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా.. రావాల్సిన గుర్తింపు రాలేదు.
ఇక ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర్రావు కూడా కొన్నాళ్లు పార్టీ కోసం పని చేశారు. తాతకు తగ్గ మనుమడిగా మాస్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ భవిష్యత్తు క్రియాశీలక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే 2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాడు యంగ్ టైగర్. అయితే.. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ సేవలు టీడీపీకి అవసరం లేదని చంద్రబాబు సన్నిహితుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించడం తెలుగు రాష్ట్రాల్లో చెవులు కొరుక్కునేలా చేసింది. అటు.. సుహాసిని కూడా 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు.
ఇక బాలకృష్ణను ఎప్పుడో దూరం పెట్టిన బాబు, తాను అధికారానికి పదేళ్లు దూరం అవ్వడంతో వెంటనే నందమూరి ఫ్యామిలీతో మళ్లీ బందం కలుపుకున్నాడు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని కొడుకు లోకేష్ కిచ్చి వివాహం చేసి మరోసారి నందమూరి సెంటిమెంటును తెరపైకి తెచ్చాడు. వియ్యకుండికి హిందూపూర్ నుంచి అవకాశం కల్పించాడు. అభిమానానికి కంచుకోట కనుక అక్కడ బాలయ్యకు సులువుగా గెలుపు వరించింది. ప్రస్తుతం బాలయ్య రెండోసారి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తు కోసం నందమూరి కుటుంబాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నందమూరి ఫ్యామిలీలో మిగిలిన వాళ్ల ఛరిష్మాను వినిపియోగించుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.