అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇన్ని రోజులు ఏపీ రాజధానిపై మౌనం వహించిన జగన్ ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు. సౌతాఫ్రికా తరహాలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటూ జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజధానిలో చట్టసభలు, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, జ్యుడిషియరీ రాజధానిగా కర్నూల్ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఈ నేపథ్యంలో జ్యుడిషియరీ రాజధానిగా కర్నూల్ ఏర్పాటుపై అడ్డంకులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే సుప్రీం కోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ఖరారు చేసి గెజిట్ విడుదల చేసిన కేంద్రం, ఇప్పుడు రాజధాని మార్పు అంటే ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. 

 

దీని ప్రకారం కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చర్చించి నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం ఇప్పుడు కర్నూల్ లో హైకోర్టు అంటే ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇలా కర్నూల్ జ్యుడిషియరీ రాజధానిగా ఏర్పాటు కావాలంటే సాంకేతిక సమస్యలు ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం జగన్ నిర్ణయాన్ని రాయలసీమ వాసులు స్వాగతించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ లోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని అది కుదరకపోతే కనీసం హైకోర్టు అయినా కర్నూల్ లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరామని తెలిపారు. కర్నూల్ రాజధానిగా ఏర్పాటు కావడమే తమ డిమాండ్ అని ఒకవేళ కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసినా తాము స్వాగతిస్తామని రాయలసీమ వాసులు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: