జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం రాష్ట్రంలో ఏ స్ధాయిలో మంటలెక్కిస్తోందో అందరూ చూస్తున్నదే. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు విషయంలో పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు కనబడటం లేదు. అమరావతిలోనే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండచ్చన్న ప్రకటనపైన కూడా ఎవరూ వ్యతిరేకంగా లేరు. కాకపోతే సమస్యంతా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రతిపాదన విషయంలోనే వస్తోంది.
సరే ఎవరి అభ్యంతరాలు, ఎవరి గోల ఎలాగున్నా మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో జగన్ ను ప్రభావితం చేసింది ఎవరు ? అనే విషయంలో ఇపుడు చర్చ మొదలైంది. ఏదో పేరుకు సౌత్ ఆఫ్రికా పద్దతిలో మూడు రాజధానులు అని జగన్ అన్నా అసలు విషయం అది కాదన్న ప్రచారం పెరిగిపోతోంది. మరేమిటి అంటే విశాఖపట్నంలోనే ఉన్న శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభావమే ఎక్కువగా ఉందని సమాచారం.
విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుందని జగన్ కు స్వామి చెప్పారట. ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి వాస్తు బాగాలేదని అప్పట్లోనే చాలామంది పండితులు చెప్పినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. చివరకు వాస్తు బాగాలేదంటూ ఐదేళ్ళల్లోనే చంద్రబాబు అసెంబ్లీకి, సచివాలయానికి ఎన్నోసార్లు వాస్తు మార్పులు చేయించిన విషయం అందరూ చూసిందే. చివరకు జగన్ సిఎం అయిన వెంటనే సచివాలయంలో వాస్తు మార్పులు చేయించిన తర్వాతే అడుగుపెట్టారు.
రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రితో చంద్రబాబు శంకుస్ధాపన చేయించిన స్ధలమే వాస్తుపరంగా మంచిది కాదని అప్పట్లో చాలా అభ్యంతరాలే వచ్చాయి. బహుశా దాని ఫలితంగానే ఏమో శంకుస్దాపన జరిగి నాలుగేళ్ళయినా ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా పడలేదు. మొత్తంమీద అమరావతి ప్రాంతం వాస్తుపరంగా రాజధాని నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని చాలామంది వాస్తు పండితులు తేల్చేశారు.
ఈ నేపధ్యంలోనే స్వరూపానంద స్వామి ఇదే విషయాన్ని జగన్ కు స్పష్టం చేశారట. అమరావతి స్ధానంలో విశాఖపట్నం అయితే ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుందని చేసిన సూచనే జగన్ మీద పనిచేసిందని అంటున్నారు.