క్షేత్రస్ధాయిలో గడచిన నాలుగు రోజులుగా అమరావతి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. రాజధానిని నిర్మించే బంగారు అవకాశాన్ని వదులుకుని ఇపుడు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటే ఉపయోగం ఏమిటి ? ’గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడట’ అన్న సామెతలాగ అయిపోయింది చంద్రబాబు పరిస్ధితి.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఏపి మొదలవ్వటమే రూ. 16500 లోటు బడ్జెట్ తో మొదలైంది. అందుకనే రాష్ట్రానికి పెద్ద పెద్ద రాజధానులు అవసరం లేదని పరిపాలన చేయటానికి ఎంత అవసరమో అంతే ఏర్పాట్లు చేసుకోమని శివరామకృష్ణన్ కమిటి స్పష్టంగా చంద్రబాబును కలిసి చెప్పింది. అయితే వాళ్ళ మాటను చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు.
ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని లాంటిది ఇక్కడే కడతానంటూ లేనిపోని సోది మొదలుపెట్టారు. సుమారు 18 దేశాలు తిరిగారు. ఆయన తిరగటమే కాకుండా అధికారులను కూడా విహారయాత్రకు తిప్పినట్లు తిప్పారు. అంతా కలిసి వందల కోట్ల రూపాయలను నాకేశారు. ఓ 400 ఎకరాల్లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ. 2500 కోట్లతో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టుకు శాస్వత భవనాలను నిర్మించేసుంటే సరిపోయేది.
అలా సరిపుచ్చుకుంటే చంద్రబాబు ఎందుకవుతాడు ? అందుకనే భూ సేకరణన్నాడు. సింగపూర్ కంపెనీలన్నాడు. స్విస్ చాలెంజ్ అన్నాడు. ఐదేళ్ళ పాటు జనాలకు ఏమిటేమిటో చెప్పి గ్రాఫిక్కులతో మోసంచేసి చివరకు ఎన్నికల్లో బోర్లాపడ్డాడు. కట్టినవన్నీ కూడా తాత్కాలికమూ, నిసిరకమూ. అందుకనే అధికారంలోకి రాగానే రాజధానిని మార్చే అవకాశం జగన్ కు చేజేతులారా చంద్రబాబే అప్పగించాడు.
ఒకవైపు తాత్కాలిక నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. మరోవైపు భూ సమీకరణ పేరుతో తన మద్దతుదారులకు, బినామీలకు వందల ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టాడు. జీవితాంతం బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి అంటే ఐదేళ్ళల్లోనే కోసుకు తినేద్దామనుకున్న చంద్రబాబు అత్యాసే చివరకు కొంప ముంచేసింది.