ఆర్టీసీ డిపోలో బ్రీత్ ఎనలైజర్లు డ్రైవర్లకు మద్యం తాగకున్నా పుల్లుగా తాగేసినట్లు భారీ రీడింగ్ ఇస్తోంది. నేను తాగలేదు మొర్రో అని డ్రైవర్లు మొత్తుకున్నా అధికారులు నమ్మని పరిస్థితి నెలకొంది. చేసేదేం లేక కొంత మంది డ్రైవర్లు.. ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. వారి దగ్గర ఉన్న బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా.. రీడింగ్ ‘జీరో’ అని సూచించింది. దీంతో పనిచేయని బ్రీత్ పరికరాలతో ఆర్టీసీ అధికారులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

 

శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం మంచిర్యాల డిపో వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు...హైదరాబాద్‌ వెళ్లాల్సిన రాజధాని బస్సుకు డ్రైవర్‌‌గా విధులు నిర్వహించడానికి రాజు అనే వ్యక్తి శుక్రవారం ఉదయం మంచిర్యాల డిపోకు చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం.. డ్యూటీ ఎక్కేముందు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేస్తారు. ఇదే క్రమంలో ఆర్టీసీ అధికారులు రాజుకు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ నిర్వహించగా.. పరికరం 53 పాయింట్లు చూపెట్టింది. వాస్తవానికి అతడికి మద్యం తాగే అలవాటే లేదట. మెషీన్ తీరుతో రాజు ఖంగు తిన్నాడు. 
 
తాను మద్యం తాగలేదని, తనకు ఆ అలవాటే లేదని ఆర్టీసీ అధికారులకు వివరించినా.. రాజుపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడు ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాడు.రెండు రోజుల కిందట మరో డ్రైవర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్టీసీ బ్రీత్‌ ఎనలైజర్‌తో టెస్ట్‌ నిర్వహించగా ఏకంగా 274 పాయింట్లు చూపించింది. దీంతో ఆగ్రహానికి లోనైన డ్రైవర్లు.. డిపో ఎదుట ఆందోళనకు దిగారు. 

 

తమను వేధింపులకు గురి చేయొద్దని, పనిచేయని ఆర్టీసీ బ్రీత్‌ ఎనలైజర్‌ను తొలగించాలని ఆర్టీసీ అధికారులను డ్రైవర్లు డిమాండ్ చేశారు. తమ పనులను సక్రమంగా చేసుకునేలా చూడాలని కోరారు. పనిచేయని పరికరాలతో తమ ఉద్యోగాలు ఊడే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇంతకుముందు మరికొంత మంది డ్రైవర్లకూ ఇలాంటి అనుభవమే ఎదురైనా బయటపడకపోవడం కొసమెరుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: