ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల అంశంపై ఘాటుగా స్పందించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయామని.. అలాంటి పరిస్థితి రాకూడదనే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే గందరగోళ పరిస్థితులు తెచ్చిందని మండిపడ్డారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ సరికాదని జయదేవ్ వ్యాఖ్యానించారు. పరిపాలన వికేంద్రీకరణ సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని రాష్ట్రానికి ఎకనమికల్ ఇంజిన్‌లా ఉండాలన్నారు జయదేవ్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లా రాజధాని ఉండాలని.. అందుకే టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసిందన్నారు. విశాఖను ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ క్యాపిటల్ అందుబాటులో ఉండాలి.. కానీ క్యాంప్ ఆఫీస్ కాదంటూ మండిపడ్డారు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలన్న జయదేవ్.. అవసరమైతే జిల్లాకో క్యాంపు కార్యాలయం కట్టుకోమనండి అంటూ ఎద్దేవా చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించి.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
 
అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, క్యాంపు కార్యాలయం, కర్నూల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలా అయితే సగం బడ్జెట్‌ టీఏ, డీఏలకే సరిపోతుందని, ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోతోందని.. ఇలాంటి పనులు చేస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. 30 వేల మంది రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు పార్టీ మారిందని ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటే రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. 

 

సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని సీఎం చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా ఏర్పాటు సమయంలో ఫ్రెంచ్ కాలనీ..డచ్ కాలనీ.. ఇంగ్లిష్ కాలనీ ఉన్నాయని, వాటిని కలిపే సమయంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు మూడు రాజధానుల ఫార్ములాను అనుసరించారన్నారు. అది ఏపీకి ముమ్మాటికీ సరిపోదని.. నెల్సన్ మండేలా అంతటి వ్యక్తే మూడు రాజధానుల విధానాన్ని తిరస్కరించారని జయదేవ్ గుర్తు చేశారు. ఆర్థిక భారం అవుతుందని సౌతాప్రికా ప్రతినిధులు కూడా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశాన్ని తొలుత సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.. ఆ తరువాత అదే విషయాన్ని కమిటీ చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. కమిటీ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. సభలో సీఎం చెప్పిన విషయాలే జీఎన్ రావు కమిటీ తెలిపిందని.. అందులో కొత్తగా ఏమీలేదని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: