పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా విస్తృతమైన నిరసనలు మరియు హింసల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లో శుక్రవారం ఐదుగురు మరణించారు. ఇద్దరు వ్యక్తులు బిజ్నోర్లో, ఒకరు కాన్పూర్లో, ఒకరు ఫిరోజాబాద్లో, మరొకరు సంభాల్లో మరణించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనల సందర్భంగా గురువారం ముగ్గురు మరణించారు. కర్ణాటక లోని మంగళూరులో ఇద్దరు వ్యక్తులు, మరొకరు ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో మరణించారు.
బాధితులపై పోస్టుమార్టం అనంతరం మరణానికి కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. అయితే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓ పి సింగ్, నిరసనకారుల పై పోలీసుల చర్యల వల్ల మరణాలు ఏవీ జరగలేదని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్లోని భడోహి, బహ్రాయిచ్, అమ్రోహా, ఫరూరుఖాబాద్, ఘజియాబాద్, వారణాసి, ముజఫర్ నగర్, సహారాన్పూర్, హాపూర్, హత్రాస్, బులంద్షహర్, హమీర్పూర్, మహోబా జిల్లాల్లో సిఎఎ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ కు దిగారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల దృష్ట్యా అలీఘర్, మౌ, అజమ్గఢ్ , లక్నో, కాన్పూర్, బరేలీ, షాజహన్పూర్, ఘజియాబాద్, బులంద్షహర్, సంభాల్ మరియు అలహాబాద్లలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపిన కేసులో ఇద్దరు వ్యక్తులు గత రాత్రి మరణించిన తరువాత కేరళ, కర్ణాటక తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలను శుక్రవారం హై అలెర్ట్ లో ఉంచారు.
ఈశాన్య ఢిల్లీ లోని 12 పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించారు. దర్యాగంజ్లోని ఢిల్లీ గేట్ ప్రాంతం నుండి హింసాత్మక నిరసనలు జరిగాయి. దర్యాగంజ్ లోని డిసిపి కార్యాలయం వెలుపల ఆపి ఉంచిన కారును తగులబెట్టారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లోని జామా మసీదు, ఇండియా గేట్లో భారీగా నిరసనలు జరిగాయి. దేశ రాజధానిలో, శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించారు. నగరం అంతటా నిరసనలపై అప్రమత్తంగా ఉండటానికి ఢిల్లీ పోలీసులు డ్రోన్లను ఉపయోగించారు. ఒకానొక సమయంలో, ఢిల్లీ మెట్రో ఓల్డ్ ఢిల్లీ ప్రాంతాలతో సహా 16 మెట్రో స్టేషన్ ల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను మూసివేసింది.