టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుకు అసలైన సవాల్ సమయం ఇదేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కేటీఆర్కు గట్టి చాలెంజ్ ఎదురైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేసీఆర్కు అన్ని ఎన్నికలు వేరు...ఇప్పుడు జరిగే ఎన్నికలు వేరని చెప్తున్నారు. జనవరి 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును రాష్ట్ర ఎన్నికలసంఘం ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యత కేటీఆర్పైనే ఉన్నందున....ఆయన నాయకత్వ లక్షణాలకు ఇదో పరీక్ష అంటున్నారు.
కీలకమైన మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది.
న్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పక్కా ప్రణాళిక, వ్యూహాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇప్పటికే ఖరారుచేశారు. సీఎం వ్యూహాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అమలుచేయనున్నారు. శుక్రవారం తెలంగాణభవన్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో పార్టీ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున అభ్యర్థుల ఎంపికలో జాప్యంచేయకుండా సమర్థులు.. పార్టీ విధేయులు.. గెలుపు గుర్రాలు, ఉద్యమకారులు, సామాజిక సమీకరణాలు.. ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపికచేయాలని సూచనలు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఔటర్ రింగ్రోడ్ లోపల దాదాపుగా 30 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిని కైవసం చేసుకోవడంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్యనేతల సేవలను అక్కడ వినియోగించుకోనున్నారు. వీరిని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇంచార్జీలుగా నియమించి.. ఎక్కడైనా నాయకుల మధ్య సమన్వయలోపం కనిపిస్తే వీరిద్వారా సమాచారం తెప్పించుకొని వారిని సమన్వయపరిచేందుకు చర్యలు తీసుకుంటారు. కాగా, గత కొంతకాలంగా కేటీఆర్ సీఎం పీఠం అధిరోహిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పురపోరులో కారుజోరును కొనసాగిస్తే..ఈ ప్రచారం నిజం కానుందని అంటున్నారు.