రోడ్లపై పశువులు, ఇతర పెంపుడు జంతువుల సంచారం ఎక్కువైపోయింది. ఆయా నగరాల్లో కుక్కలు,కోతులు, పందుల బెడద విపరీతంగా ఉంది. అయితే, వీటిలో పెంపుడు జంతువులు అయిన కుక్కల విషయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. యజమానులు తమకు ఇష్టమని కుక్కలు పెంచుకుంటున్నారు. అయితే వాటి ఆలనాపాలనా పట్టించుకోకుండా....రోడ్లపై వదిలిపెడుతున్నారు. దీంతో....సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు పెంచుకునే వారికి....ఇంటి యజమానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, ఇకముందు ఇలా జరిగే అవకాశాలు తగ్గిపోనున్నాయి. ఎందుకంటే... తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెంపుడు జంతువులను రోడ్లపై వదిలిపెడితే...పెద్ద ఎత్తున ఫైన్ వేయనున్నారట.
రోడ్లపై సమస్యలు సృష్టించే జంతువులను నియంత్రించడం జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం బాధ్యత. పెంపుడు జంతువుల విషయంలో వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఏడాది 957 పందులను, 677 పెంపుడు జంతువులను పట్టుకొని యజమానులకు జరిమానాలు విధించారు. జరిమానాల రూపం లో రూ. 1323317 వసూలు చేసినట్లు వారు పేర్కొన్నారు. అలాగే, 344 కోతులను పట్టుకొని అడువుల్లో వదిలివేసినట్లు తెలిపారు. ఇవి కాకుండా రోడ్లపై మరణించే పశువులను, జంతువులను వెంటనే ఆటోనగర్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, జీహెచ్ఎంసీ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిప్రమాదాలు, భూకంపాలు, భవనాలు, చెట్లు వంటివి కూలడం, గాలివానలు, వరదలు తదితర విపత్తులను సమర్థవంతగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ అత్యాధునిక పరికరాలతోకూడిన వాహనాలను రంగంలోకి దింపింది. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు వచ్చేలోగానే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడతాయి. అయితే అత్యంత భారీ సంఘటనలు జరిగినప్పుడే వీటిని రంగంలోకి దింపుతారు. మొత్తంగా ఇటు ప్రకృతి పరంగా...అటు ప్రజల రూపంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడంలో జీహెచ్ఎంసీ క్రియాశీలంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.