సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 సీట్లతో ఘన విషయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకు పరిమితం కాగా జనసేన ఒకే ఒక నియోజకవర్గంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ 23 సీట్లకే పరిమితమై పెద్ద షాక్ తింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కొందరు నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన అనంతరం జంపింగుల పర్వం ఊపందుకుంది.
ఇప్పటికే పలువురు బీజేపీ కండువా కప్పుకోగా.. మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులకు సంబంధించి త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడించేలోపే తెలుగుదేశం పార్టీకి తీవ్ర స్థాయిలో గండి కొట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనుచరులపై కేసులు, వేధింపుల నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఎమ్మెల్యే పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు అధినేత చంద్రబాబుకు పంపిన వాట్సాప్ లేఖలో ప్రకటించారు.
ఇక తాజాగా టీడీపీకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన గిరిధర్.. వైఎస్సార్సీపీకి జై కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ నేతలపై విరుచుకుపడ్డారు. అయితే.. రాజధాని అమరావతిలో రైతుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంటే.. జగన్ మాత్రం మాస్టర్ ప్లాన్తో గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యేని వైఎసీపీ వైపుకు తిపుకున్నారు.
ఇక మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వెళ్ళనున్నారనీ, అందులో మద్దాలి గిరి ఒకరనీ, మిగతా నలుగురూ రేపో మాపో వైఎస్ జగన్ మోహన్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారనీ తెలుస్తోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా రెండు, మూడు రోజుల్లో జగన్ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన కూడా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది.