గత కొంతకాలంగా ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తాజాగా మళ్లీ అదే తరహాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎంపీలుగా పనిచేసిన వారిపై, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నవారిపై ఆయన హాట్ హాట్ కామెంట్లు చేశారు. ఏకంగా టీఆర్ఎస్ నేతకు తాను టికెట్ దక్కకుండా చేయగలనని సైతం ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాన్ని తిరిగి తెరిపించాలని గత కొంతకాలంగా రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావ్ తాజాగా దీక్షను సందర్శించారు. రైతుల చేత విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాదికల్లా సీసీఐ ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. సీసీఐ రీ ఓపెన్ కోసం ఢిల్లీలో ధర్నాకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఒకవేళ, సీసీఐ తెరిపించకుంటే తనగల్లా పట్టుకొని నిలదీయవచ్చని , ఇంకోసారి ఓట్లు కూడా అడగనని ఆయన ప్రకటించారు.
దీనికి కొనసాగింపుగా ఎంపీ సోయం బాపురావ్ పలు విమర్శలు చేశారు. గతంలో ఉన్న నేతలకు సోయి లేకపోవడం వల్ల సీసీఐ ఓపెన్ కాలేదని ఆయన అన్నారు. గతంలో ఎంపీలుగా ఉన్న గొడెం నగేష్, వేణుగోపాలచారిని కాలర్ పట్టుకొని నిలదీయాలని టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ...రైతులతో పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నను ఆయన హెచ్చరించారు. ఇన్నేళ్లు గడ్డి తిన్న జోగురామన్న, ఇప్పుడు రాజకీయ లబ్దికోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. తాను పక్క రాజకీయ నాయకుడిగా మారితే జోగురామన్న ఇంట్లో నుండి కూడా బయటకు రాలేడని హెచ్చరించారు. అతిగా మాట్లాడితే రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ టికెట్ కూడా రాకుండా చేస్తానని బీజేపీ ఎంపీ అయిన సోయం బాపురావు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.