తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు మనుషుల గురించి ఆయన ప్రస్తావిస్తూ...కీలక వ్యాఖ్యలు చేశౄరు. హెచ్జె దొర ఆటోబయోగ్రఫీ జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించొచ్చు అని కేసీఆర్ చెప్పారు. విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచే బోధించాలని భావిస్తున్నామని సీఎం తెలిపారు.
దురదృష్టవశాత్తూ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మనషులు మృగాల్లా మారుతున్నారని పేర్కొన్నారు. నేరప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాల తయారీ కోసం మాజీ డీజీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జీయర్స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటామన్నారు. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన బాగస్వామ్యం అందించాలని సీఎం పిలుపునిచ్చారు. మంచిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు అని సీఎం అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని కేసీఆర్ స్పష్టం చేశారు. పరోక్షంగా ఆయన దిశ ఎన్కౌంటర్ ఘటనను గుర్తు చేశారని పలువురు అంటున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమితం కాకుండా పోలీసులు సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా అరికట్టడం, హరిత హారం ద్వారా చెట్లను పెంచడంలో పోలీసులు ఎంతో కృషి చేశారు అని సీఎం కొనియాడారు.
కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయని మాజీ డీజీపీ హెచ్జె దొర అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు రాష్ర్టానికి గొప్ప సంపదగా మిగులుతాయి. మానవ వనరులు సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది అని హెచ్జె దొర స్పష్టం చేశారు.