ఈనెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలు వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. వేడుకలను పురస్కరించుకొని నిర్వహించే పరేడ్లో రెండు రాష్ట్రాల శకటాలకు అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ రెండు రాష్ట్రాలే మహారాష్ట్ర, బెంగాల్. పరేడ్లో తమ రాష్ర్టాల శకటాలను అనుమతించకపోవడంపై మండిపడ్డాయి. మహారాష్ట్రలోని అధికార కూటమికి చెందిన శివసేన, ఎన్సీపీతోపా టు బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రె స్ (టీఎంసీ) కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. మహారాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరణ వెనుక రాజకీయ కుట్ర ఉన్నదా అని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాలు కావడంవల్లే మహారాష్ట్ర, బెంగాల్ శకటాలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్లో విమర్శించారు. విపక్ష పార్టీల పాలిత రాష్ర్టాలపై మోదీ సర్కార్ సవతి ప్రేమను చూపుతున్నదని మండిపడ్డా రు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసన వ్యక్తంచేస్తున్నందుకే బెంగాలీల ను మోదీ సర్కార్ అవమానించిందని టీఎంసీ ధ్వజమెత్తింది. అడ్డగోలు చట్టాలను, కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను బెంగాల్ ప్రజలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణమని ఆ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి తపస్ రాయ్ ఆరోపించారు. ఈ ఏడాది తాము ‘కన్యాశ్రీ ప్రకల్ప’ పథకాన్ని ప్రధాన ఇతివృత్తం (థీమ్)గా.. ‘సర్వధర్మ సమన్వయ’ సందేశంతో కూడిన శకటాన్ని పరేడ్లో ప్రదర్శించాలనుకోవడంలో తప్పేమిటని టీఎంసీ నేత కల్నల్ దీప్తాన్షు చౌదరి (రిటైర్డ్) ప్రశ్నించారు. బాలికల అభ్యున్నతికి తమ ప్రభుత్వం 2012లో ప్రవేశపెట్టిన ‘కన్యాశ్రీ’ పథకం ఐరాస అవార్డును గెలుచుకొందని, కేంద్రం తెచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకం దీనికి ఏమాత్రం సరితూగకపోవడంతో మోదీ సర్కార్ ఈర్ష్యతో ఉడికిపోతుందని ఆయన మండిపడ్డారు.
అయితే, ఈ వివాదంపై కేంద్రం స్పందించింది. నిపుణుల కమిటీ 2 సార్లు పరిశీలించాకే బెంగాల్ శకట ప్రతిపాదనను తిరస్కరించిందని రక్షణ శాఖ తెలిపింది. గణతం త్ర పరేడ్ కోసం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 32 ప్రతిపాదననలు, కేంద్ర శాఖలు, విభాగాల నుంచి 24 ప్రతిపాదనలు రా గా.. 22 ప్రతిపాదనలు ఆమోదం పొందాయని తెలిపింది. శకటాలకు అనుమతించిన 15 రాష్ర్టాల్లో 8 బీజేపీ పాలిత రాష్ర్టాలు కాగా, 4 కాంగ్రెస్, 3 ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ర్టాలున్నాయి. కాగా, బీజేపీ సైతం ఈ వివాదంపై స్పందించింది.బెంగాల్ సర్కార్ నిబంధనలను పాటించనం దుకే ఆ ప్రతిపాదన తిరస్కారానికి గురైందని బీజేపీ పేర్కొంది.