మొత్తం కుటుంబమంతా అమరావతి రాజధానిని తరలించేందుకు లేదని ఆందోళనలకు మద్దతుగా నిలబడితే మరి కోడలు మాత్రం ఎందుకు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ? ఈ పాటికే అర్ధమయ్యుంటుంది ఎవరి విషయం మాట్లాడుకుంటున్నామో ? అదేనండి చంద్రబాబునాయుడు కుటుంబం గురించి ప్రత్యేకంగా నారా బ్రాహ్మణి గురించే. బ్రాహ్మణి ఆందోళనలవైపు కన్నెత్తి చూడకపోవటంపై ఆమె చాలా తెలివైనదనే ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పోటి చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. లోకేష్ ను గెలిపించటానికి భార్యగా బ్రాహ్మణి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారంలో బ్రాహ్మణికి జనాలు బ్రహ్మరథం పట్టారు. తీరా చూస్తే లోకేష్ ఓడిపోయారు. దాంతో బ్రాహ్మణి బోల్డు బాధపడిందట.
రాజధాని, రాష్ట్రాభివృద్ధి కోసం మామగారు చంద్రబాబు, భర్త అంత కష్టపడినా పార్టీ ఓడపోవటంతో పాటు వ్యక్తిగతంగా లోకేష్ కూడా ఓడిపోవటం బ్రాహ్మణికి బాధతో పాటు ఒళ్ళు కూడా మండిపోయిందని సమాచారం. అంత ఘోరంగా భర్తను ఓడించిన తర్వాత నియోజకవర్గం వైపు బ్రాహ్మణి మళ్ళీ అటువైపు కూడా కన్నెత్తి చూడలేదన్న విషయం అందరకీ తెలిసిందే.
భర్త ఓడిపోయిన బాధ, కోపంతోనే బ్రాహ్మణి ఇపుడు రాజధాని తరలిపోతుందనే ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదనే చర్చ జరుగుతోంది. ఆందోళనలకు మద్దతుగా ఒకవైపు చంద్రబాబు నానా గోల చేస్తున్నారు. అదే సమయంలో జరుగుతున్న ఆందోళనలన్నీ పెయిడ్ ఆందోళనలని, ఎక్కువమంది పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారనే ఆరోపణలు అందరూ వింటున్నదే.
రాజధాని తరలింపు విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్నపుడు మద్దుతు పలకాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని కూడా బ్రాహ్మణికి అనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు అత్తగారు నారా భువనేశ్వరి వచ్చి దీక్షలో కూర్చున్న విషయం అందరూ చూసిందే. అదే సమయంలో ఉద్యమ ఖర్చుల క్రింత చేతి గాజులను కూడా విరాళంగా ప్రకటించారు. మరి కుటుంబం మొత్తం ఉద్యమం కోసం అంత కష్టపడుతుంటే బ్రాహ్మని కనీసం అటువైపు కూడా తొంగి చూడలేదంటే ఏమిటర్ధం ?