తెలుగుదేశంపార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయినట్లే ఉంది చూస్తుంటే. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు చాలామంది టిడిపి నేతలు, కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత అవే ఆరోపణలను వైసిపి నేతలు ఆధారాలతో సహా మళ్ళీ చెబుతున్నారు.
సరే వైసిపి నేతలు ఇన్ సైడర్ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి టిడిపి నేతలు ఇపుడు అవే ఆరోపణలతో ఎదురు దాడి చేస్తున్నారు. తాజాగా వైసిపి నేత అంబటి రాంబాబు ఆరోపణలకు టిడిపి నేత బోండా ఉమా మహేశ్వరరావు కౌంటర్ ఇస్తు జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు.
రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ప్రకటనకు ముందే రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు కాబట్టే భారీ ఎత్తున భూములు కొనేశారంటూ అంబటి ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడు, బోండా మాట్లాడుతూ టిడిపి నేతలు పెద్ద ఎత్తున భూములు కొనింది ఇన్ సైడర్ ట్రేడింగ్ అయితే జగన్ కూడా తాడేపల్లి గ్రామంలో భూములు కొన్నారు కాబట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లే అనే వితండ వాదాన్ని లేవదీయటమే విచిత్రంగా ఉంది.
రాజధాని ప్రకటనకు ముందు భూములు కొంటేనే ఇన్ సైడర్ ట్రేడింగ్ అవుతుందన్న కనీస జ్ఞానం కూడా టిడిపి నేతలకు లేకపోవటమే విచిత్రంగా ఉంది. నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే వాళ్ళకు తెలీక కాదు వితండ వాదాన్ని మొదలుపెట్టింది. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి గబ్బు పట్టిస్తున్నారు. రెండు పార్టీల నేతల్లో ఎవరు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడింది కొద్ది రోజుల్లో తేలిపోతుంది లేండి.