నువ్వు మూర్ఖుడివి. నీకు ఎప్పటికీ ఓట్లువేయం. కార్చిచ్చు అంటుకొని దేశం తగులబడుతుంటే, మీరు కొత్త సంవత్సరం వేడుకలు ఆస్వాదిస్తారా.. ఇదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిపై .. బాధితుల ఆగ్రహం. అయితే ప్రజల ఆగ్రహం సమంజసమే అని ఒప్పుకున్న ఆసిస్ ప్రధాని.. బాధితుల కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. 

 

ఆస్ట్రేలియాను కార్చిచ్చు కబళిస్తోంది. ఐదు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. అక్టోబర్ లోనే ప్రారంభమైన కార్చిచ్చు.. లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ సంపదను నాశనం చేస్తోంది. ఇప్పటివరకూ ఈ దావాగ్నికి 18 మంది మృతి చెందగా.. వందల ఇళ్లు తగులబడ్డాయి. ఈ పరిణామంతో సిడ్నీ సమీపం నుంచి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. మంటలు అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు సాగుతున్నాయి. బాధితులను పరామర్శించేందుకువెళ్లిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోరిసన్‌కు ..ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

 

నువ్వు ఒక మూర్ఖుడివి. నీకు ఎప్పటికి ఓట్లు వేయమంటూ.. అగ్నిప్రమాద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని వెళ్లగా.. అతనిని కలిసేందుకు వారు ఇష్టపడలేదు. అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఒక మహిళా ఫైర్‌ ఫైటర్‌ను అభినందిస్తూ ఆమెతో కరచాలనం చేసేందుకు ప్రధాని ప్రయత్నించారు. అయితే ఆమె ప్రధానితో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. అంతలో అక్కడ ఉన్న మరో వ్యక్తితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అతను కూడా నిరాకరించి ప్రధానికి క్షమాపణ చెప్పి దూరంగా వెళ్లిపోయాడు. కాగా ఆ వ్యక్తి ఇతరుల ఇళ్లను కాపాడే ప్రయత్నంలో తన ఇళ్లను పోగొట్టుకున్నాడని ఒక అధికారి వెల్లడించారు.

 

కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగుబడుతుంటే.. మీరు మాత్రం కిర్రిబిల్లి హౌస్‌లో కూర్చొని కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాదిస్తారా అంటూ ఒక వ్యక్తి ప్రధానిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  నువ్వు ఒక మూర్ఖుడివి.. నిన్ను మళ్లీ మేం ప్రధానిగా చూడబోమంటూ' మరొక వ్యక్తి ప్రధాని మోరిసన్‌ మీద విరుచుకుపడ్డాడు.  వీటిపై  స్పందించిన మోరిసన్ .... '  ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నా కళ్లారా చూశాను. నన్ను తిట్టినందుకు నేనేం బాధపడటం లేదు. ఇందులో మానవ తప్పిదం ఏం లేదు. కేవలం ప్రకృతి వైపరిత్యాల వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. అగ్నిప్రమాద బాధితులకు ... మా ప్రభుత్వం తరపున కావల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

 

గతేడాది మేలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి  స్కాట్‌ మోరిసన్‌ ప్రధాని పదవిని చేపట్టాడు. దేశంలోని ఐదు రాష్ట్రాలు కార్చిచ్చుతో సతమతమవుతుంటే.. మోరిసన్‌, తన కుటుంబంతో కలిపి హాలిడే టూర్‌ పేరుతో హవాయి నగరాన్ని సందర్శించారు. ప్రధాని తీరుపై అక్కడి ప్రజలు, విపక్షాలు, మీడియా దుమ్మెత్తి పోశాయి. దీనిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు మోరిసన్‌ తెలిపారు. జనవరి 13 నుంచి 16 వరకు స్కాట్‌ మోరిసన్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా,  ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: