అప్పటి మంత్రి అధికారం మాటున అండదండలతో అక్రమార్కులు అడవిని ధ్వంసం చేశారు. అడవి రక్షకులమంటూ.. వాటిని భక్షించారు. అటవీ సహజ వనరులను తామే నీతికి, నిజాయతీకి బ్రాండ్ అంబాసిడర్లమంటూ నిత్యం నీతులు వల్లించే ఆ పార్టీ నేతలు మైనింగ్ నిర్వాహకులతో కలిసి దోచేశారు. 1990లో సర్వే నంబరు 28లో 36.58 ఎకరాల భూమిని పొదలకూరు మండలం నందివాయ రెవెన్యూ పరిధిలోఉమామహేశ్వరీ మైన్ నిర్వాహకులకు మైనింగ్ అనుమతి ఇచ్చారు. దాదాపు ఆ సర్వే నంబరులో 214 ఎకరాల భూమి ఉంది. 70 ఎకరాల భూమి అందులో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది.
రెవెన్యూ భూములను మైనింగ్కు అనుమతులు తీసుకున్న నిర్వాహకులు మాత్రం రెవెన్యూ భూముల పరిధి దాటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి చొరబడ్డారు. ఇష్టానుసారంగా కొండలు, గుంటల భూములను తవ్వేసి తెల్లరాయి, గ్రావెల్, మెటల్ను అక్రమంగా రవాణా చేశారు. 19 ఏళ్ల పాటు మైనింగ్ అనుమతులు పొందిన లీజుదారులు ఆయా భూములను పీల్చి పిప్పి చేసి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచేశారు. మైనింగ్ అనుమతులు ముగిసినా కూడా 2009 నాటికి నిర్వాహకులు రెన్యువల్ చేయించుకోలేదు. అయినా యథేచ్ఛగా మైనింగ్ను కొనసాగించారు. టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే అప్పటి అధికార పార్టీ నేత, మాజీమంత్రి అండతో దోపిడీని కొనసాగించారు.
మైనింగ్ నిర్వాహకుడు జిల్లా మంత్రితో ఒప్పందం చేసుకుని టీడీపీ హయాంలో అనుమతులు లేకుండానే రెవెన్యూ భూములే కాకుండా నందివాయ రిజర్వ్ ఫారెస్ట్ను కూడా ఆక్రమించారు. ఫారెస్ట్ పరిధిలో ఉండే కొండలను జిలెటిన్స్టిక్ వంటి పేలుడు పదార్థాలతో పేల్చి తెల్లరాయి నుంచి గ్రావెల్, మెటల్ను అక్రమ రవాణా సాగించారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఫారెస్ట్ పరిధిలో సుమారు 20 ఎకరాల్లోకి చొచ్చుకుపోయి సహజ వనరులను కొల్లగొట్టుతున్నా అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అండదండలు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనకాడిన అధికారులు మైనింగ్ నిర్వాహకుడితో లాలూచీ పడి అక్రమ రవాణాకు సహకరించారు. అప్పట్లో అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2017లో అటవీశాఖ, రెవెన్యూ శాఖ సర్వే నిర్వహించి ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.
దీంతో మైనింగ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కానీ అప్పటి అధికార పార్టీ మంత్రి అండదండలు ఉండడంతో సర్వే నివేదికను తొక్కి పెట్టారు. దీంతో మైనింగ్ నిర్వాహకుడు మాత్రం అక్రమ రవాణా దందా కొనసాగించాడు. జిల్లా స్థాయిలో అధికారులందరికీ నందివాయ రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం తెలిసిందే . జిల్లా ఉన్నతాధికారి దృష్టికి ఈ వ్యవహారంపై గత అటవీశాఖ అధికారులు తీసుకెళ్లినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో కనీసం స్పందించలేదని తెలిసింది. జిల్లా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ఈ అక్రమ మైనింగ్కు అండగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి సహకరించి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు కూడా అక్రమ మైనింగ్కు పూర్తి స్థాయిలో అండదండలు అందించారు.