బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైడ్రామాకు తెరలేపారు. బుధవారం సాయంత్రం మాజీ సీఎం బెంజ్సర్కిల్ వద్దనున్న వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చారు.
అనంతరం ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జేఏసీ నేతలతో కలసి బెంజిసర్కిల్ నుంచి పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్రగా వెళ్లడానికి వీల్లేదని, సాయంత్రం వేళ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని పోలీసు అధికారులు వివరించారు.
బస్సుయాత్రకు కూడా అనుమతి లేని విషయాన్ని స్పష్టంచేశారు. అనుమతి తీసుకుని యాత్ర ప్రారంభించాలని సూచించారు. అయితే వారి మాటను పెడచెవిన పెట్టి చంద్రబాబు సహా నేతలు వాగ్వాదానికి దిగారు. ఆటోనగర్ వెళ్తామంటూ మంకుపట్టు పట్టారు. మాజీ సీఎం తీవ్రస్థాయిలో పోలీసులపై బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. అనంతరం చంద్రబాబు, ఇతర నేతలు బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని సవాలు విసిరారు. పదేపదే పోలీసులు విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా మొండిగా రోడ్డుపైనే బైఠాయించారు.
బెంజిసర్కిల్లో చంద్రబాబు, ఇతర నేతలు బైఠాయించడంతో గంటన్నరపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. చంద్రబాబుతో పోలీసు అధికారులు పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోవడంతో ప్రతిపక్ష నేత, జేఏసీ నేతలతోపాటు మాజీ మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. చంద్రబాబు, లోకేష్లను ఇంటి వద్ద దింపేశారు. మిగిలిన నేతలను వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. కాగా, బెంజిసర్కిల్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగడంతో నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. .