భోగి పండుగతో సంక్రాంతికి ఒక రోజు ముందు సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. ఎలాగంటే ఇళ్లకు  పాడి పంటలు సమృద్ధిగా వచ్చే కాల సమయం. సూర్యోదయానికి పూర్వమే  ఈ రోజు నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, భోగి మంటలు ప్రతి ఇంటి ముందు  వేస్తారు.

 

భోగి మంటలలో పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ  పనికిరాని బట్టలు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి కొత్త సంతోషం, ఆప్యాయతలతో కూడుకుని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.


రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళానైపుణ్యం గోచరిస్తాయి. ఒక పత్రంగా ప్రతి ఇంటి ముంగిలీ , చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రాధాన్యముంది. ఈ సత్కార్యాలను  సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ప్రేరేపిస్తోంది.


 ఆంధ్రా రాయల సీమ ప్రాంతాల్లో కనుమ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి, పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటి ప్రత్యేక మైన దాణాను అందచేస్తారు. గోపూజ నిర్వహిస్తారు. పంట చేల వద్ద కొంత మంది రైతులు రేగాకు , ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులాగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఆంధ్రా ప్రాంతంలో మూడు రోజులు జరుపుకుంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఒకటి , రెండు రోజులే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: