ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెనుక పరుగులు పెడుతుంది. ఇక రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ లో ఏది కావాలన్నా మన చెంతకు వచ్చి వాలిపోతుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా లావాదేవీలు జరపాలి అంటే బ్యాంకుకు వెళితే కానీ పని అయ్యేది కాదు... ఆ తర్వాత ఏటీఎం కి వెళ్లి లావాదేవీలు జరుపుకునేవారు... కానీ ఇప్పుడు మాత్రం మనం ఎక్కడ ఉన్న అరచేతి నుంచి ఎన్నో లావాదేవీలు జరుపుకోవడానికి వీలు ఉంటుంది. ఏటీఎం కి వెళ్లాల్సిన అవసరం లేదు బ్యాంకు వైపు అసలు చూడాల్సిన పనేలేదు.. ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంతో మంది ఆన్లైన్ పేమెంట్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు.
ఇండియా కాస్తా డిజిటల్ ఇండియా గా క్రమక్రమంగా మారుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్నపేమెంట్ యాప్స్ అన్నింటిలో ఎక్కువగా అందరూ వినియోగించేది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం... ప్రస్తుతం ఏ స్మార్ట్ఫోన్ వినియోగదారుల మొబైల్ లో చూసిన ఈ మూడు ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కువగా భారతీయులందరూ ఈ మూడు యాప్స్ ద్వారానే ఆన్లైన్ పేమెంట్ లు చేస్తూ ఉంటారు. ఇక ఆయా పేమెంట్ యాప్స్ కూడా తమ తమ వినియోగదారుల కోసం అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ సహా ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తుండటంతో నెటిజన్లు ఎక్కువగా వీటినే వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ మూడు పేమెంట్ యాప్స్ ద్వారా సెక్యూరిటీ తో కూడిన లావాదేవీలు జరపవచ్చు కాబట్టి అందరూ వీటిపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
అయితే ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ టాప్ లో దూసుకుపోతున్న ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్లైన్ పేమెంట్ యాప్ లకు త్వరలో భారీ షాక్ తగిలబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు . ఎందుకంటే గూగుల్ పే ఫోన్ పేటీఎం వినియోగదారుల కోసం అందిస్తున్న యూపీఐ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు జియో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రస్తుతం పూర్తవగా.. త్వరలోనే మై జిఓ యాప్ లో యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ ని జియో అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఇతర పేమెంట్ తరహాలోనే బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఒకవేళ జియో యూపీఐ పేమెంట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న పేమెంట్ యాప్ లకు షాక్ తప్పదని నిపుణులు అంటున్నారు.