వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటించారు.
గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఈ భరోసా కేంద్రాల్లోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. వచ్చే ఖరీఫ్ నాటికి 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్ షాపుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. రైతుల భరోసా పథకాన్ని చెప్పిన దానికంటే ముందుగానే అమలు చేశామని సీఎం స్పష్టం చేశారు.
వ్యవసాయంలో కీలక సంస్కరణలు తీసుకువస్తామని అన్నారు ముఖ్యమంత్రి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని.. పశువులకు హెల్త్ కార్డులు, పంట భీమా కార్డులు ఇస్తామని సభలో ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు సీఎం జగన్. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తామని., . రైతుల ఇన్సురెన్స్ ప్రీమియం కింద 2100 కోట్లను ప్రభుత్వం అదనంగా భరిస్తోందని వివరించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తానికి రైతు పక్షపాతం దిశగా అడుగులు వేస్తోంది. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. ఇంకేముందీ జగన్ రైతుల ఆరాధ్య దైవమైపోయారు. వరుసగా వరాల జల్లులు కురిపిస్తుండటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. రైతు భరోసాతో ఏపీ సీఎం అన్నదాతలకు ఊరట కల్పిస్తున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రైతుల్లో ఒకింత సంతోషాన్ని నింపుతున్నారు జగన్.