హస్తకళలు, చేనేత వస్త్రాలకు నిలయంగా పేరొందిన మాదాపూర్లోని శిల్పారామం మాదిరిగానే ఉప్పల్లోనూ శిల్పారామం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చూపరులను ఆకట్టుకునే రీతిలో శిల్పారామం ఆర్చీ (ప్రవేశ ద్వారాన్ని) ఏర్పాటు చేశారు. దీనికి ఎదురుగా ఫౌంటేన్ను నిర్మించారు. విభిన్న రుచులతో ఫుడ్కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేంపదకు పెద్ద యాంపీ థియేటర్ని సిద్ధ్దం చేశారు. ఎటుచూసిన పచ్చని అందాలు కనువిందు చేసేలా ల్యాండ్ స్క్రేపింగ్ పనులు చేపట్టారు. వెదురు బొంగులతో స్టాళ్లు నిర్మించారు. హస్తకళలు, చేనేత వస్త్రాల కోసం 50 స్టాళ్లను నిర్మించారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ను ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ప్రజల నుంచి విశేష స్పందన దక్కుతుండటంతో త్వరలో మరిన్ని అందాలు తోడుకానున్నాయి.
మూసీనది తీరంలో హెచ్ఎండీఏ ఏడున్నర ఎకరాల స్థలంలో రూ. ఐదు కోట్లు ఖర్చు చేసి మినీ శిల్పారామాన్ని నిర్మించింది. గడిచిన ఏడునెలలుగా అందుబాటులోకి వచ్చిన ఈ మినీ శిల్పారామంలో వీకెండ్ రోజుల్లో నిత్యం సందర్శకులతో కళకళలాడుతోంది. తూర్పుదిశగా ఉన్న భాగ్యనగర ప్రజలను ఎంతగానో అబ్బురపరుస్తున్న ఉప్పల్ శిల్పారామంను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. సాయంకాలం సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతుండడంతో మరిన్ని అందాలను సమకూర్చాలని శిల్పారామం అధికారులు నిర్ణయించారు. మ్యూజియం, మినీ కాన్ఫరెన్స్ హాల్, అదనపు స్టాళ్లు, వాటర్ ఫౌంటెయిన్ తదితర కొత్త అందాలు, సౌలభ్యాలు ఉప్పల్ శిల్పారామం కల్పించనున్నారు.
డిమాండ్కు అనుగుణంగా ఉప్పల్ శిల్పారామంలో నూతన హంగులు సమకూర్చేందుకుగానూ చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు రూ. ఐదు కోట్లు నిధులను కేటాయించాలన్న శిల్పారామం అధికారుల విజ్ఞప్తి మేరకు హెచ్ఎండీఏ ఇటీవల రూ. 5 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పనులు చేపట్టి మరిన్ని అందంగా శిల్పారామంను సిద్ధం చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ శిల్పారామం రూపు మారడం ఖాయమని అంటున్నారు.