చంద్రబాబుకు.. నందమూరి ఫ్యామిలికు ఎంత దగ్గర సంబంధం ఉందో.. అంత రాజకీయ దూరం ఉంది. పేదప్రజలకు సేవ చేసేందుకే నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించారు. అయితే ఆయన అడుగుజాడల్లోనే నడవాలంటూ కొందరు వారసులు వచ్చినా.. వారిని తొక్కుకుంటూ వచ్చాడు చంద్రబాబు. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్లను వాడుకుని.. అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్లను పక్కన పెట్టేశాడు. ఇక ఎన్నికలప్పుడు నందమూరి తారక రామారావు గారి పేరును అన్న ఎన్టీఆర్ అంటూ స్మరించే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు.
టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి సాధ్యమైనంత దూరం పెట్టాడు. హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా ఆ కుటుంబానికి సంబంధించిన అందరినీ అందకారంలోకి నెట్టేశాడు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను వాడుకున్నాడు. ఆ తర్వాత అధికారం చేపట్టాక.. వారి వంక కూడా చూడని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల తెలంగాణలో టీడీపీ కష్టాల్లో ఉండడంతో.. ఆ ఎన్నికల్లో నందమూరి వారి అమ్మాయిగా నందమూరి సుహాసిని బరిలోకి దింపాడు చంద్రబాబు. అయితే కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసిన నందమూరి సుహాసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ప్రతి సారి తాను కష్టాల్లో ఉన్నప్పుడు నందమూరి ఫ్యామిలీని తీసుకొచ్చి ప్రచారం చేయించుకుని వదిలేస్తున్నాడు. ఇలా ఆ కుటుంబీకులను తనకు నచ్చినట్టు చెప్పుచేతల్లో ఉంచుకునే ఎత్తుగడలతో చంద్రబాబు తన జిత్తులన్నీ చూపించాడు. ఇక తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున ప్రచారం చేసింది నందమూరి సుహాసిని. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారామె. ఈ నేపథ్యంలోనే పరువు పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాలని టీడీపీ భావించింది. అయితే నేటి ఫలితాల్లో మాత్రం టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది.