పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ఆర్సీ భారత దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందనీ, కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టింది కాదని ఆయ‌న అన్నారు.  సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల పౌరసత్వం తీసేస్తారన్న భయాలు ఎవరికీ అవసరం లేదనీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మత ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ నిపుణులతో వారి సందేహాలు నివృత్తి చేస్తామన్నారు. 

 

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతోపాటు రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారత రాజ్యాంగం గొప్పది. మత ప్రాతిపదికన ప్రజల్ని విడదీయదు. మతం పేరుతో మనుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. తాత, తండ్రి వివరాలు అందుబాటులో లేకపోతే మీరు భారత పౌరులు కారు అనుకోవద్దు. అది సాధ్యపడదు కూడా. ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయి. తెలంగాణలో సకల జనుల సర్వే అని పెట్టినప్పుడు కూడా ఆంధ్రవారిని సపరేట్ చేయడానికని అపోహలు రేపారు. అలాంటివి చేయడం అసాధ్యం. ఆధార్ కోసం వివరాలు కోరినప్పుడు కూడా చాలామందిలో సందేహాలు వచ్చాయి... ఓ ప్రయివేట్ కంపెనీకి ఇస్తే ఏం జరుగుతుందోనన్న అనుమానం వచ్చింది. అయితే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి.` అని అన్నారు. 

 


దేశాన్ని ప్రేమిస్తా... మతానికి అతీతంగా మాట్లాడతాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``సీఏఏ తీసుకు వచ్చింది బంగ్లాదేశ్ లాంటి సరిహద్దు దేశాల నుంచి వచ్చే హిందువులు-ముస్లింల కోసం. ఇది కేవలం ఒక్క ముస్లింల కోసమే అన్నది అబద్దం. అసోంలో వలసల కారణంగా వారి ఉద్యోగాలు పోతున్నాయి, భూముల ధరలు పెరిగిపోతున్నాయన్న భయంతోనే గొడవ. నేను దేశాన్ని ప్రేమిస్తా. మతానికి అతీతంగా మాట్లాడుతా. ఎవరో చెప్పింది విని చట్టం గురించి తెలుసుకోకుండా భయాలు పెట్టుకోవద్దు. ముందుగా జనసేన పార్టీలో ఉన్న ముస్లిం సోదరులంతా కలసి కూర్చుందాం. ఎవరికి ఎలాంటి భయాలు ఉన్నాయో నివృత్తి చేసుకుందాం. నా వరకు స్వతహాగా దేశ సమగ్రతను కోరుకుంటా. దేశ భక్తిని మత ప్రాతిపదికన కొలవలేం.  దేశం విడిపోయినప్పుడు పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా విడిపోతే, భారత దేశాన్ని మాత్రం హిందూ రిపబ్లిక్ గా చేసే అవకాశం ఉన్నా చేయలేదు. `` అని అన్నారు. 

హిందూత్వం అనేది ఒక జీవన విధానమ‌ని, మతం కాదని ప‌వ‌న్ అన్నారు. ``హిందుత్వంలో దేవుడిని చూసేందుకు ఎన్నో దారులు ఉన్నాయి. పాకిస్థాన్ విషయానికి వస్తే తూర్పు-పశ్చిమ భాగాల్లోనే ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య హింస ప్రజ్వరిల్లడం బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసింది. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి మన దేశానికి వచ్చే మైనారిటీల కోసమే సీఏఏ తీసుకువచ్చారు. ఎన్ఆర్సీ మాత్రం ప్రతి పౌరుడికీ వర్తిస్తుంది.`` అని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: