ఈరోజు బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆరోగ్య రంగానికి రూ. 69,000 కోట్లు కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి 10% పెరుగుదల. మొత్తం కేటాయింపులలో రూ. 6,400 కోట్లు ప్రధానిమంత్రి జన ఆరోగ్య యోజనకు కేటాయించారు.స్వచ్ఛభారత్ మిషన్కు రూ.12,300 కోట్లు, జల్జీవన్ మిషన్కు రూ.11,500 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ పథకం విస్తరణ వలన పిపిపి మోడల్ క్రింద టైర్ -2, టైర్ -3 నగరాల్లో మరిన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే వైద్య పరికరాలపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నుండి నిధులు సమకూరుతాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం... 25% పెరుగుదలతో కూడా భారతదేశం తన ఆరోగ్య రంగాన్ని మెరుగు పరుచుకోవడానికి వీలుకాదని తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం పెరుగుతూ వస్తుంది.
ఆరోగ్య సంరక్షణ బడ్జెట్లో పెరుగుదల నత్తనడకన సాగుతుండటంతో శిశు మరణాలను తగ్గించడం వంటి స్థిరమైన లక్ష్యాలను సాధించడం భారత్కు క్లిష్టతరంగా మారుతుంది. యునిసెఫ్ ప్రకారం, అత్యల్ప శిశు మరణాల రేటు కలిగిన 52 తక్కువ-మధ్యతరగతి ఆదాయ దేశాలలో భారతదేశం 12వ స్థానంలో ఉంది.
2019లో కోటాలోని జెకె లోన్ ఆసుపత్రిలో చేరిన 963 మంది శిశువులు పేలవమైన సౌకర్యాలు, అపరిశుభ్రతతో ప్రాణాలు కోల్పోయారు. ఆ ఆసుపత్రిలో రోజూ కనీసం 3-4 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత లేని పరిస్థితులు, సరైన సౌకర్యాలు లేకపోవడమేనని దీనికి కారణమని తేలింది.
కోటా ఆసుపత్రిలో జరిగిన ఘోర విషాదానికి కారణాలు రాజస్థాన్లోని రాష్ట్ర ప్రభుత్వంపై పడ్డాయి. అయితే భారతదేశంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి 72 గంటల్లో 61 శిశు మరణాలను నమోదు అయ్యి ప్రభుత్వ ఆస్పత్రి దీనస్థితిని మరలా ప్రతిబింబించింది.
దేశంలోని లక్షల మంది పేదలకు ఉన్న ఏకైక ఎంపిక అయిన ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయడానికి ఖర్చులను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటూనే ఉంది. మరి ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ.69 వేల కోట్లు ఎంత సమర్థవంతంగా ఆచరణలో పెడతారో చూడాలిక.