తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు దారుణ అత్యాచారం, హత్య ఉదంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ సమీపంలో జరిగిన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ ఘటన ఒకటైతే...ప్రశాంతంగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుర్మార్గుల చేతిలో దారుణంగా కన్నుమూసిన సమత ఘటన మరొకటి. దిశ ఘటనలో ఇప్పటికే బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరిగింది. తాజాగా సమత ఘటనలో మరో రకమైన న్యాయం జరిగింది.
గత ఏడాది నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపి ఉరి శిక్ష విధించారు. దీంతో పాటుగా ప్రభుత్వం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన సమత కుటుంబానికి ఎస్సీ కమిషన్ సూచన మేరకు మూడెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్ కార్యాలయంలో ఆ భూమికి సంబంధించిన పత్రాలను తహసీల్దార్ జనుము నారాయణ సమత భర్త గోపికి అందజేశారు. పాతయెల్లాపూర్ శివారులోని సర్వే నంబర్ 108లో ఈ భూమిని కేటాయించారు.
ఎల్లపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దుం అనే మానవ మృగాలు సమతపై గతేడాది నవంబర్ 24న సామూహిక అత్యాచారం చేసి, ఆమె చేతి వేళ్లు, కాళ్లను కోసేసి హతమర్చారు. రెండో రోజు ఆ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ తర్వాత 2 రోజుల్లోనే నిందితులను గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసి 20 రోజుల్లో తగిన ఆధారాలు సేకరించారు. మృతిచెందిన సమతకు సంబంధించి డీఎన్ఏ సరిపోలిన నివేదిక, ఘటనా స్థలి నుంచి ఆమె దుస్తులు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, భౌతిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి లేఖ రాశారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆదిలాబాద్లో ఎస్సీ, ఎస్టీ కోర్టునే ప్రత్యేక కోర్టుగా మలిచి ఈ కేసును విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు నిందితులపై ప్రత్యేక కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితుల తరఫు వాదించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రాలేదు. దీంతో ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది రహీంను నిందితుల తరఫున వాదించేందుకు కోర్టు నియమించింది.అనంతరం వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు ఉరి విధిస్తూ తీర్పు ఇచ్చింది.