రోజు రోజుకి మానవత్వం అనేది మంటగలిసిపోతుంది. మగాడు మృగాడిలా మారిపోతున్నాడు. రోజు రోజుకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నిత్యం ఎక్కువయిపోతున్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు వచ్చినా కూడా అసలు భయమనేది మాత్రం ఎవ్వరికీ ఉండడం లేదు. ఆఖరికి స్కూల్కి వెళ్ళే పసి పిల్లలను కూడా వదలడం లేదు ఈ మృగాడు. ఇటీవలె ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పొన్నూరు మండలంలో ములుకుదురుకు చెందిన తొమ్మిదవ తరగతి చదివే బాలిక స్థానిక పాఠశాలలో వెళుతుంది. విద్యార్థినిపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన గోపి అనే యువకుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాక విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించసాగాడు.
అయితే ఇంటికి వెళ్లిన ఆ బాలిక మాత్రం భయపడకుండా తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన పై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసును నమోదు చేశారు. అయితే దీనిపై పోలీసులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి. కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు తాము కేసు నమోదు చేసుకోలేదని, దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయరావును కలిసి తిరిగి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మరి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎందుకింత మొండి వైఖరిని చూస్తున్నారు దీని వెనుక దాగి వున్న అసలు నిజ నిజాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఓపక్క మృగాళ్ళ ఆగడాలు ఈ విధంగా జరుగుతుంటే ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత కుటుంబాల పై పోలీసులు కూడా ఈ మధ్య జులుము చూపిస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవలె దిశ కేసు విషయంలో కూడా మొదట పోలీసులు ఇదే విధంగా ప్రవర్తించారు.
బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంకా తిరిగి రాకపోవడంతో కంప్లయింట్ ఇస్తే దాన్ని చూసి వెతకాల్సింది పోయి తిరిగి వారినే మాటలు అంటున్నారు. మరి ఇలాంటి వాటి పై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే బావుంటుందని పలు ప్రజా సంఘాలు భావిస్తున్నారు.