టీ-20 సిరీస్ను వైట్ వాష్ చేసిన జోష్తో బరిలోకి దిగిన టీమిండియాకు ఫస్ట్ వన్డేలో ఊహించని షాక్ తగిలింది. కివీస్ 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా రెండో వన్డేలో గెలవాల్సిన పరిస్థితిలో నిలబడింది కోహ్లీసేన. ఆక్లాండ్ వేదికగా కీలకమైన వన్డేకి రెడీ అయింది టీమిండియా. రేపు జరగనున్న ఈ మ్యాచ్లో మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది టీమిండియా.
టీ-20 సిరీస్లో సొంతగడ్డపై చెత్త ప్రదర్శనతో వెనకబడిన న్యూజిలాండ్ ఫస్ట్ వన్డేలో పంజా విసిరింది. వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా జోరుకు బ్రేకులు వేసింది కివీస్. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో నిలవాలంటే కచ్చితంగా రెండో వన్డేలో గెలవాల్సిన పరిస్థితి టీమిండియాకు ఏర్పడింది.
కివీస్ బ్యాట్స్మెన్ల్లో రాస్టేలర్, టామ్లాథమ్, హెన్రీ నికోలస్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరందరూ ఫస్ట్ వన్డేలో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపారు. రాస్ టేలర్ శతకంతో చెలరేగగా, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్లు అర్థసెంచరీలు సాధించారు. దీంతో వీరి బ్యాటింగ్పైనే కివీస్ విజయావకాశాలు ఆధారపడ్డాయ్. బౌలింగ్లో కివీస్ బౌలర్లు అంతగా ఆకట్టుకోలేదు. సౌధీ, బెనెట్, ఇష్ సోది బౌలింగ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాలని భావిస్తోంది కివీస్ మేనేజ్మెంట్.
మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, దావన్లు గాయాలతో జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు కొంత మైనస్గా మారింది. ఫస్ట్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఓపెనింగ్లో ఫర్వాలేదనిపించారు. అయినా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లీ, శ్రేయస్, రాహుల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురూ మరోసారి చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. బ్యాటింగ్లో టీమిండియా బలంగా ఉన్నా..బౌలింగ్లో తేలిపోతోంది. బుమ్రా రన్స్ కంట్రోల్ చేస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. షమీ ఫర్వాలేదనిపిస్తున్నా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో సెకండ్ వన్డేలో బౌలింగ్లో టీమిండియా మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ జరిగే ఈడెన్ వేదిక బ్యాటింగ్కు అనుకూలించనుంది. మరోసారి పరుగుల వరద పారనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.