ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బిజెపి ఆప్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలను తీసుకున్నాయి. కాగా పటిష్ట బందోబస్తు మధ్య ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఢిల్లీ మొత్తం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా ఎంతో మంది ప్రముఖులు కూడా ఓటు హక్కును
వినియోగించుకున్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సివిల్ లైన్స్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మహిళలు తప్పనిసరిగా ఓటు వేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ పనితీరు ఆధారంగానే హస్తిన వాసులు ఓటు వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ లో అధికారంలోకి రావడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పాండవ్ నగర్ లోని ఎంసీడీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... ఢిల్లీ ప్రజలు అందరూ మెరుగైన విద్య వైద్యం తమ పిల్లల మెరుగైన భవిష్యత్ కోసం ఆమ్ఆద్మీ పార్టీని మరోసారి గెలిపించ బోతున్నారూ అంటూ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని... ఓటు హక్కు పౌరులకు నైతిక హక్కు అని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈరోజు ఉదయం 8 గంటలనుంచి పోలింగ్ ప్రారంభమైంది కానీ పలుచోట్ల వివి ప్యాడ్ మిషిన్లు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ప్రత్యేక పూజలు కూడా చేస్తుండడం గమనార్హం.