దేశ రాజధాని ఢిల్లీలో...జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మట్టికరిచి ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఘన విజయం అనేక పార్టీలను ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఢిల్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ -2020 సమ్మిట్లో భాగంగా, దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై న చర్చా గోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొత్త విశ్లేషణలు చేశారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలు ఏవి లేవు అంటూ కేటీఆర్ సూత్రీకరించారు. ``బీజేపీ, కాంగ్రెస్లు సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుంది.`` అని అన్నారు. గత కొంత కాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. `` రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేక పోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ` అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా...వాటి ఆచరణ అంతా కూడా రాష్ట్రాల్లోనే ఉందని కేటీఆర్ తెలిపారు. ``కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుంది. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో కీలకంగా ఉంటుంది.`` అని కేటీర్ పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని కేటీఆర్ అన్నారు.`` రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదు...ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే... కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి.`` అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ- కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. `` ఆ రెండు పార్టీలను. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తాం.. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. కేవలం తమ వాదన లేదా ఐడియాలజీ కి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన... కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేము, ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించాము. డిమానిటైజేషన్ ద్వారా దేశానికి మంచి జరుగుతుంది, సంపూర్ణ క్రాంతి వస్తుంది అన్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం మాటలను నమ్మి మద్దతు ఇచ్చాము... కానీ డిమానిటైజేషన్ ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలింది. బీజేపీ-కాంగ్రెస్ పరస్పరం టీఆర్ఎస్ ఆయా పార్టీలకు టీంలుగా విమర్శిస్తున్నాయి.. కానీ మేము తెలంగాణ ప్రజల పార్టీ అనే విషయాన్ని చెప్తున్నాము.` అని కేటీఆర్ అన్నారు.
సిటిజన్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కేటీఆర్ తెలిపారు.`` కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టాల కన్నా దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలు ఉన్నాయనేది మా పార్టీ అభిప్రాయం... భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మెర్స ర్ గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుంది...భారతదేశాన్ని రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉంది.`` అని అన్నారు.
``కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి, ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నాం...నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు,ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత సహాయకారిగా ఉండాల్సిన అవసరం ఉన్నది... అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది.`` అని అన్నారు.