అమ్మా నన్ను ఎందుకు కన్నావమ్మా.. వెచ్చని నీ గర్భంలో భద్రంగా ఉన్న నన్ను రాకాసులు తిరిగే లోకంలోకి తీసుకు వచ్చావు.. ఈ లోకంలో నేను ఇమడలేక పోతున్నానమ్మా. ఈ పాడు లోకం సూటిపోటి మాటలతో, సూదుల్లా గుచ్చుతుంటే తట్టుకోలేక పోతున్నానమ్మా.. అమ్మా నన్ను చంపెయ్యమ్మా.. అవునమ్మా నేను నిజమే చెబుతున్నాను నన్ను చంపేయమ్మా. అని కన్న పిల్లవాడు తన తల్లి ఎదురుగా నిలబడి ఈ మాటలు చెబుతుంటే కన్న హృదయం ఎంతలా ద్రవించిపోతుందంటే, ఈ మాటలు ఆ పసినోట వినడానికా ఇంతకాలం నేను బ్రతికి ఉన్నదని ఓ తల్లి పడే ఆవేదన ప్రతి మనస్సుని చలింపచేస్తుంది...
ఇదిగో ఇలాంటి సంఘటనే ఓ తల్లికి ఎదురైంది. ఆ వివరాలు తెలుసుకుంటే అతను చేయని తప్పుకు అతనికి ప్రాప్తించిన మరుగుజ్జు రూపం.. దీని వల్ల ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడో ఆ పసి హృదయానికి తెలుసు.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బ్రిస్బేన్కు చెందిన క్వాడెన్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియా అనే మరుగుజ్జుతనం కారణంగా బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లోని తోటి విద్యార్ధులు అతన్ని బాగా అవమానించేవారు. అయినా అతడు వారి మాటలను మౌనంగా భరించేవాడు. కానీ, రోజురోజుకు వారి అవమానాలు పెరగడంతో, తట్టుకోలేక మనస్తాపంతో చనిపోవాలాని నిర్ణయించుకున్నాడట..
ఇక సాయంత్రం అతని తల్లి యర్రాక బైల్స్ అతడ్ని తీసుకెళ్లటానికి స్కూల్ దగ్గరకు రాగా, బాధలో ఉన్న ఆ అబ్బాయి, మౌనంగా కారులోకి వచ్చి కూర్చుని, ఏడవటం ప్రారంభించాడట.. కొడుకును గమనించిన తల్లి ఏమైందని అడగగా, క్వాడెన్ తనకు జరిగిన అవమానాన్ని తల్లితో చెప్పుకుంటూ, అమ్మా నన్ను చంపేయమ్మా. అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండటంతో ఆ తల్లి మనస్సు తల్లడిల్ల సాగింది. తాను మాత్రం ఏం చేయగలదు ఓదార్చడం తప్పితే.. కాని అలా ఆలోచించలేదు. ఆ కుర్రాడు పడుతున్న బాధ అందరికి తెలియాలని, కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసి దాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో ఉంచింది యర్రాక.
దీంతో ఆ వీడియో కాస్తా వైరల్గా మారి, అతడికి అన్ని వర్గాలనుంచి మద్దతు తోడైంది. ఈ విషయంలో ఆ తల్లి స్పందిస్తూ.. మా అబ్బాయి అవమానాల పాలు కావటం కొత్తేమీ కాదు. అవమానాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేశాడు. మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాలను సీక్రెట్గా.. స్కూల్ ప్రిన్సిపల్కు చెప్పి ఊరుకునే దాన్ని. కానీ, ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, ఇలాంటి పిల్లల విషయంలో ముందు జాగ్రత్త పడాలని ఇలా చేసా అంటూ పేర్కొంది..