కరోనా కోరలు చాస్తోంది. హడలెత్తిస్తోంది. నేరుగా మరణశాసనం రాసేస్తోంది. భూమండలం ఏర్పడ్డాక ఇంత పెద్ద ఎత్తున జనాలను భయపెట్టిన మహమ్మారి వేరొకటి లేనే లేదని పెద్ద సైంటిస్టులు అంటున్నారు. కరోన దెబ్బకు ప్రపంచవ్యాంగా ఇప్పటికి మూడు వేల మంది వరకూ చనిపోయారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నారు. దేశాలకు పాకుతూ సోకుతూ కరోనా బీభత్సం స్రుష్టిస్తున్న ప్రళయం, విలయం అంతా ఇంతా కాదు.
ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోకి కూడా కరోనా ప్రవేసించింది. కరోనా అన్నది ఓ భూతంగా మారిపోయింది. హైదరాబాద్ లో దుబాయి వెళ్ళి వచ్చిన ఒకరికి పాజిటివ్ రిపోర్టు వస్తే తిరుపతి రుయా అసుపత్రిలో మరొకరు అబ్జర్వేషన్లో ఉన్నారు. కరోనా కన్నీటి కధలు మరో వైపు ప్రపంచంలో నలుమూలలా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి.
అటువంటి కరోనాకు విరుగుడు లేదా, ఈ మహమ్మరి వైరస్ కి మందు కనిపెట్టలేదా అని అంతా ఆవేదన చెందుతున్న వేళ ఓ తీపి కబురు వినవస్తోంది. అదేంటి అంటే ప్రపంచం అంతటిని గడగడలాడిస్తున్న కోవిడ్ -19 వైరస్ కు విరుగుడు కనిపెట్టడానికి కొద్ది నెలలు పట్టవచ్చట. అమెరికా ఉపాద్యక్షుడు మైక్ పెన్స్ ఈ విషయం చెప్పారు. వచ్చే వేసవి నాటికి లేదా, వర్షాకాలం ఆరంబం నాటికి అంటే ఒక ఆరేడు నెలల్లో ఈ వైరస్ కు చికిత్స కనుగొనగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వాక్సిన్ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందేనన్నారు.ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని ఆయన తెలియచేశారు. ఓ విధంగా ఇది శుభవార్త అయినా మరో ఆరేడు నెలలు పట్టవచ్చు అంటున్నారు. అప్పటికి మరెంతగా ఇది విశ్వరూపం దాలుస్తుందో మరెన్ని ప్రాణాలను బలికొంటుందోనని అంతా ఆందోళన పడుతున్నారు.
ఏది ఏమైనా కరోనా వీర విహారంతో దేశాలకు దేశాలు హడలెత్తుతూంటే అంతే వేగంగా ఆర్ధిక వ్యవస్థ సైతం పతనావస్థకు చేరుకుంటోంది. మరి కరోన వైరస్ పనిపట్టి తరిమికొట్టే ఆ విరుగుడు మందు తొందరగా కనిపెట్టాలని అంతా ప్రార్ధిస్తున్నారు. ఆ రోజు తోందరగా రావాలని కూడా అర్ధిస్తున్నారు.