చంద్రబాబునాయుడు పాలనపై 2019లో జనాలు తీర్పునిచ్చారు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలాగుందనే విషయంలో జనాలు తొందరలో తీర్పివ్వబోతున్నారా ? అవును ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొమ్మిది నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిపక్షాలు, పచ్చమీడియా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్న అందరూ చూస్తున్నదే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ చంద్రబాబునాయుడు, పచ్చమీడియా తప్పు పడుతునే ఉన్నాయి. జగన్ పరిపాలనకు పనికిరాడని, జగన్ కు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలీదని, జగన్ దెబ్బకు పరిశ్రమలన్నీ పారిపోతున్నాయని...ఒకటేమిటి ప్రతి రోజు గోల గోల.
జగన్ పాలనపై చివరకు తెలుగుదేశంపార్టీ నేతలు ఏ స్ధాయిలో బురద చల్లుతున్నారంటే రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది కాబట్టి ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను డిమాండ్ కూడా చేశారు. టిడిపి ఓ పద్దతి ప్రకారం చేస్తున్న ఆరోపణలను అధికార వైసిపి అంత సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. సరే ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టేద్దాం.
మరి వాస్తవాలేమిటి ? ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, ప్రతిపక్షాలు, పచ్చమీడియా చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులే అని అనుకుంటే ఆ విషయాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత జనాలపైనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణి, ఇంటికే ఫించన్, విద్యాదీవెన, అమ్మఒడి లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు.
దాదాపు అన్నీ వర్గాలను తన సంక్షేమ పథకాలతో జగన్ టచ్ చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికన్నది చాలా కీలకంగా మారింది. జగన్ పరిపాలన బాగుందా ? లేకపోతే చంద్రబాబు, పచ్చమీడియా ఆరోపణలే కరెక్టా ? అన్నది చెప్పాల్సిన బాధ్యత జనాలపైనే ఉందిపుడు. జగన్ పాలన బాగుందని జనాలు అభిప్రాయపడితే చంద్రబాబు, టిడిపి నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. అదే చంద్రబాబు ఆరోపణలనే జనాలు బలపరిస్తే పచ్చమీడియాను పట్టడం కష్టమే. ఏదేమైనా నెల రోజుల్లో అంతా తేలిపోతుంది లేండి.