అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే H-1B వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కారు కొద్దికాలం క్రితం ఇంకో షాక్ ఇస్తూ దరఖాస్తు రుసుమును కూడా పెంచింది. అయితే, ఈ షాకుల పరంపరలో ఓ గుడ్న్యూస్ తెరమీదకు వచ్చింది. కొత్త విధానం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో చాలా మార్పులు తీసుకురానుంది. అంతేకాకుండా సమాచార సేకరణ, పేపర్ వర్క్ తగ్గించడం, యాజమాన్యాలకు అయ్యే ఖర్చులను కూడా తగ్గించడం వంటి తీపికబుర్లు ఉన్నాయి.
వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల్లో భాగంగా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి1న మొదలై..మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉద్యోగి, యజమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. సమాచార సేకరణ, పేపర్ వర్క్ను కుదించినప్పటికీ, లబ్ధిదారు పూర్తిపేరు, లింగ సమాచారం, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, పాస్పోర్టు నంబర్, జాబ్ ఆఫర్ లెటర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో వలే లాటరీ ద్వారా కాకుండా హెచ్-1బీ వీసాలు రిజిస్ట్రేషన్ సమయంలోనే స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి అమెరికా పౌరసత్వ, వలససేవల సంస్థ (యూఎస్సీఐఎస్) విషయం వెల్లడించి 90 రోజుల్లోపు హెచ్-1బీ వీసాకు పిటిషన్ పెట్టుకోవాలని సూచిస్తుంది. దీంతో ఎంపిక అయిన వారు మాత్రమే పిటిషన్ దాఖలు చేస్తుండటంతో చాలా ఖర్చు, శ్రమ మిగులుతాయి. ఈ పిటిషన్లను ఏప్రిల్ 1 నుంచి దాఖలు చేయవచ్చు. కాగా, ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. ఈ మేరకు ఇటీవల గణాంకాలు వెల్లడించింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న వారి వెన్నులో వణుకుపుట్టేలా అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ గతంలో పలు నిబందనలు అమలు చేసింది.