ప్రపంచ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి విచిత్రంగా తయారైంది. 50 వార్డులున్న మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులు అన్నీ చోట్లా దొరకటం లేదని సమాచారం. కార్పొరేటర్లుగానే పోటీ చేయటానికి ముందుకు రాకపోతే ఇక మేయర్ అభ్యర్ధి గురించి పెద్దగా ఆలోచించటం లేదు.
మొదటినుండి కూడా టిడిపి తిరుపతి నియోజకవర్గంలో వీకనే చెప్పాలి. ఏదో గాలి కొట్టినపుడు మాత్రమే టిడిపి ఇక్కడి నుండి గెలిచింది. 37 ఏళ్ళ తెలుగుదేశంపార్టీ ప్రస్ధానంలో మూడుసార్లు మాత్రమే టిడిపి ఇక్కడి నుండి గెలిచిందంటేనే పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయినట్లే తిరుపతిలో కూడా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమపథకాల అమలులో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు.
ఈ నేపధ్యంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి ఎదురుగాలి వీస్తోందన్న విషయం అర్ధమైపోతోంది. ఎన్నికల్లో పోటి చేసే విషయంలో కొందరు నేతలతో చంద్రబాబే నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నా పెద్దగా రెస్పాన్స్ రావటం లేదని సమాచారం. వైసిపిని ఎదుర్కొని ఎన్నికల్లో పోటి చేయటం, గెలవటం కష్టమనే అభిప్రాయం చాలామంది నేతల్లో ఉంది. దాంతో పోటికి ముందుకు రావటం లేదు. ఇదే సమయంలో అధికార వైసిపి మంచి ఊపుమీదుంది.
వైసిపి తరపున 50 డివిజన్లలో పోటి చేయటానికి కార్పొరేటర్లు రెడీ అయిపోయారు. కాకపోతే వివిధ కారణాలతో బహిరంగంగా ప్రకటించలేదట. అదే విధంగా మేయర్ అభ్యర్ధి జనరల్ మహిళకు కేటాయించారు. అయితే వైసిపి మాత్రం బిసి మహిళనే అందులోను యాదవులకే కేటాయించనున్నట్లు ప్రకటించేసింది. తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించటంతో బిసిల్లో మంచి జోష్ కనబడుతోంది.
తిరుపతిలో బలిజలు, బ్రాహ్మణుల తర్వాత యాదవ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత రెడ్లు, ఎస్సీలు, ముస్లింల ఓట్లున్నాయి. కాబట్టి ఏ కోణంలో చూసినా మేయర్ స్ధానాన్ని బిసిలకు కేటాయించటం రాజకీయంగా పార్టీకి ప్లాస్ అయ్యేదనటంలో సందేహం లేదు. ఎలాగూ అధికారపార్టీ అనే ట్యాగ్ వల్ల వచ్చే ప్లస్ పాయింట్లుంటాయి కాబట్టి ఎన్నికల్లో వైసిపి స్పీడుగా దూసుకుపోతోందనే చెప్పాలి.