తెలుగుదేశంపార్టీ చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ కొత్త తరహాలో చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చాడు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం దశాబ్దాలుగా టిడిపిలోనే కీలకంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుండి పోటి చేసి గెలిచిన కరణం తాజాగా తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసిపిలోకి పంపారు. గురువారం వెంకటేష్ తో పాటు మాజీ మంత్రి పాలేటి రామారావు అండ్ కో వైసిపి కండువా కప్పుకోవటం సంచలనంగా మారింది.

 

ఇక్కడ ట్విస్టు ఏమిటంటే తాను మాత్రం టిడిపిలోనే ఉంటారట. అయితే తన కొడుకు మాత్రం వైసిపి బలోపేతానికి కృషి చేస్తాడట. అంతే కాకుండా తాను టిడిపిలోనే ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేందుకు తన శాయసక్తులా కృషి చేస్తానని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. కరణం తాజా ప్రకటనతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయుంటుంది. తన కొడుకు, పాలేటి రామారావుతో పాటు కరణం కూడా జగన్ ను కలిసి అందరికీ కండువాలు దగ్గరుండి కప్పించటం మరో విశేషం.

 

కొడుకుతో పాటు పాలేటి తదితరులు వైసిపి కండువాలు కప్పుకునేటప్పుడు టిడిపి ఎంఎల్సీ పోతుల సునీత, ఎంఎల్ఏ వల్లభనేని వంశీ అంటే టిడిపిలోనే ఉన్న చంద్రబాబు వ్యతిరేకులంతా ఇక్కడే ఉన్నారు. టిడిపిలో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలయ్యేట్లు చూస్తామని కరణం చెప్పటమే విడ్డూరంగా ఉంది. తాను టిడిపిలో ఉండటం ఏమిటి ? తన కొడుకు వైసిపి బలోపేతానికి కష్టపడటమేంటో ? ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఇంతకుముందు ఎంఎల్ఏలు వంశీ, మద్దాలి గిరి, ఎంఎల్సీలు సునీత, సిద్దార్ధరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబుతో విభేదించిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే చంద్రబాబుతో విభేదించారో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. కానీ కరణం మాత్రం టిడిపిలోనే ఉంటూ ప్రభుత్వానికి మద్దతిస్తానని చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరణం తాజా ప్రకటనతో చంద్రబాబుకు షాక్ తగలిందనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: