ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణశాఖల పద్దులపై చ‌ర్చ సంద‌ర్భంగా  ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీకి పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు మైనార్టీ సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసిన 54 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో వివరించారు. అయితే, ఈ సంద‌ర్భంగా మజ్లిస్ పార్టీ వ‌ల్లే న‌గరానికి మెట్రో రైలొచ్చిందని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

 

అసెంబ్లీలో అక్బరుద్దీన్​ మాట్లాడుతూ మజ్లిస్​ పోరాటం వల్లే  హైదరాబాద్​కు మెట్రో వచ్చిందని అసెంబ్లీలో అన్నారు. హైదరాబాద్​లో మెట్రో రైలు నిర్మాణం చేయాలని వైఎస్​ హయాంలో అసెంబ్లీలో తానే తొలిసారిగా మాట్లాడినట్లు ప్రధాన ప్రతిపక్ష నేత చెప్పారు. అప్పట్లో హైదరాబాద్​కు​మెట్రో రైలు కావాలని తాను అడిగితే, కాంగ్రెస్​ ఎమ్మెల్యే పీజేఆర్​ మోనో రైలు కావాలని అడిగేవారని, దీంతో అంతా కన్ఫ్యూజన్​కు గురయ్యేవారని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్​కు మెట్రో వచ్చినా ఓల్డ్​ సిటీకి రాలేదని, ఓల్డ్​ సిటీపై ప్రభుత్వం శీత కన్నేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఓల్డ్​ సిటీ మెట్రో రైల్​ అలైన్​మెంట్​లో 93 ప్రార్థన మందిరాలు ఉండడం వల్ల ఆ అలైన్‌‌మెంట్​ను మార్చాలని తాము కోరినట్లు చెప్పారు.

 

మెట్రో రైలును తాము వ్యతిరేకించడం లేదని ఓవైసీ తెలిపారు.  మెట్రోను ఓల్డ్​ సిటీకి విస్తరించేందుకు ఇన్నాళ్లు మూసీ ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్​ రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిందని, మరి చాదర్‌‌ఘాట్‌‌ నుంచి మూసీ నది మీదుగా వెళ్లిన మెట్రో లైన్​కు ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్​ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అడిగితే క్లియరెన్స్​లు అడ్డు వస్తున్నాయని, మీరు చేస్తే అడ్డు రాదా అని నిలదీశారు. ఎంఎంటీఎస్​ ఫేజ్​ –2 కూడా విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ అది కూడా రాలేదని అక్బ‌రుద్దీన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: