ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణశాఖల పద్దులపై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఆ పార్టీకి పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పాతబస్తీతోపాటు మైనార్టీ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన 54 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో వివరించారు. అయితే, ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీ వల్లే నగరానికి మెట్రో రైలొచ్చిందని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ మజ్లిస్ పోరాటం వల్లే హైదరాబాద్కు మెట్రో వచ్చిందని అసెంబ్లీలో అన్నారు. హైదరాబాద్లో మెట్రో రైలు నిర్మాణం చేయాలని వైఎస్ హయాంలో అసెంబ్లీలో తానే తొలిసారిగా మాట్లాడినట్లు ప్రధాన ప్రతిపక్ష నేత చెప్పారు. అప్పట్లో హైదరాబాద్కుమెట్రో రైలు కావాలని తాను అడిగితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే పీజేఆర్ మోనో రైలు కావాలని అడిగేవారని, దీంతో అంతా కన్ఫ్యూజన్కు గురయ్యేవారని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్కు మెట్రో వచ్చినా ఓల్డ్ సిటీకి రాలేదని, ఓల్డ్ సిటీపై ప్రభుత్వం శీత కన్నేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఓల్డ్ సిటీ మెట్రో రైల్ అలైన్మెంట్లో 93 ప్రార్థన మందిరాలు ఉండడం వల్ల ఆ అలైన్మెంట్ను మార్చాలని తాము కోరినట్లు చెప్పారు.
మెట్రో రైలును తాము వ్యతిరేకించడం లేదని ఓవైసీ తెలిపారు. మెట్రోను ఓల్డ్ సిటీకి విస్తరించేందుకు ఇన్నాళ్లు మూసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిందని, మరి చాదర్ఘాట్ నుంచి మూసీ నది మీదుగా వెళ్లిన మెట్రో లైన్కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అడిగితే క్లియరెన్స్లు అడ్డు వస్తున్నాయని, మీరు చేస్తే అడ్డు రాదా అని నిలదీశారు. ఎంఎంటీఎస్ ఫేజ్ –2 కూడా విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ అది కూడా రాలేదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.