చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 157దేశాల్లో కరోనా కాటుకు 6515మంది మృతి చెందగా.. 169, 415మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఇండియాలోనూ కరోనా కలకలం రేపుతోంది. కరోనా వ్యాప్తితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కేవలం మనుషులపైనే కాకుండా.. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రానిక్, ఐటీ.. ఇలా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ క్రమంలో కరోనా వైరస్ సోకకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వైరస్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఆఫీస్లో పనిచేసేవారు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి కరోనాకు చికిత్స కన్నా ముందు జాగ్రత్తలే మేలంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని సందర్భాలలో ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే చేతులను వేర్వేరు పనుల కోసం వినియోగిస్తాం. అటువంటి సమయాల్లో వైరస్ చేతులకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆఫీస్లో అయినా మరెక్కడైనా శానిటైజర్ను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. అలాగే మౌత్ మాస్కులు పెట్టుకోవడం మాత్రం అస్సలు మరచిపోకూడదు. ఇక ఆఫీస్లో ఇతరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా, కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగానే వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. మరియు మీ ఆఫీస్, ముఖ్యంగా మీరు పని చేసే దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్నయో లేదో చూసుకోవాలి.
ఇక వైరస్ చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. కానీ ఆ చేతులతో కళ్లు, ముక్కును నులుముకుంటే అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ కళ్లు, ముక్కు ద్వారా ప్రధానంగా లోపలకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కాగా, ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. మరియు పాజిటివ్ కరోనా తేలిన హైదరాబాద్ వ్యక్తి పని చేస్తున్న కంపెనీ కూడా పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. కాబట్టి.. మీకు కూడా వీలుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంచుకోవడం ఉత్తమం.