కరనోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఒకప్పుడు నిఫా.. ఎబోలా.. జికా... స్వైన్ఫ్లూ.. ఇప్పుడు కరోనా. ప్రపంచమంతా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటోంది. సుమారు రెండు నెలల కిందట చైనాలోని వుహాన్ పట్టణంలో కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు సుమారు 150 దేశాలకు విస్తరించి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోగా... ఎంతో మందిని ఆసుపత్రులపాలు చేసింది. ఇదీ ఒక రకమైన ఫ్లూ వైరస్ అయినప్పటికీ ప్రాణాంతకంగా పరిణమించడంతోపాటు, దీన్ని పూర్తిస్థాయిలో తగ్గించే మందు అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి.
ఇంతకాలం ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో విజృంభిస్తున్నా.. భారత ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల చాలాకాలం దేశంలోకి ప్రవేశించలేదు. అయితే ఇటీవల భారత్ లోకి ప్రవేశించిన ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇలా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండడంతో కరోనా కట్టడికి కేంద్రం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు ఏపీలో కూడా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. వైరస్ లక్షణాలతో పలువురు ఐసోలేషన్ వార్డుల్లో కూడా చేరుతున్నారు.
ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ పలు కీలక చర్యలు చేపట్టింది. ఆప్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారత్కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధించింది. అలాగే ఇది ఈనెల 31 వరకూ అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక ఇప్పటికే ఐరోపా దేశాలు టర్కీ, బ్రిటన్ ప్రయాణీకులపై కూడా భారత్ నిషేధం విధించింది. మరోవైపు ఇప్పటికే చాలా రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ను మూసివేయగా.. కేంద్రం ప్రకటనలతో మిగిలిన రాష్ట్రాల్లోనూ అమల్లోకి రానుంది.