తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా నిన్న మూడు కొత్త కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 16కు చేరింది. ఇక కరోనా భయాన్ని కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. లేని పోని అపోహలు సృష్టిస్తూ.. కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మాస్క్, శానిటైజర్స్ లాంటివి కృత్రిమంగా కొరత సృష్టిస్తూ 10 అన్న చోట 100 వసూళ్లు చేసే పరిస్థితి. అంతే కాదు కొన్ని చోట్ల ఇవి డూప్లికేట్స్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకొంటున్నారు. లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులకు వైరస్ సోకింది. వీరిద్దరినీ నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయి.
కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కిరాణాషాపులు, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించాలని చూసే ‘బ్లాక్ మార్కెట్ గాళ్లను’ ఉపేక్షించమని హెచ్చరించారు.ఇంతకుముందు థియేటర్లు, మాల్స్ మూసివేతను వారం రోజులుగా నిర్ణయించామని, అయితే, ఆ గడువును ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను కూడా రద్దు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో భక్తులను అనుమతించవద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా పై ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా.. కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్ లక్షణాలు ఉన్నవారంతా విదేశాల నుంచి వచ్చిన వారే అని స్ఫష్టం చేశారు. ప్రజలకు ఇప్పడు దైర్యం కావాలి.. వారి ఇబ్బందులను ఆసరాగా చేసుకోకూడదని సూచించారు.