కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. ఇప్పటికే 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. ఇక ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా... ఇప్పటివరకూ... 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధానంగా... చైనా కంటే ఎక్కువ మృతుల సంఖ్యను కలిగివున్న ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627 మంది చనిపోయారు.
అందువల్లే మృతుల సంఖ్య 11వేలు దాటేసింది. ఖండాంతరాలు చుట్టేస్తున్న కిల్లర్ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ వ్యూహం రచించారు. అందులో భాగమే జనతా కర్ఫ్యూ. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో 2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు.
దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ జీవితం సుమారు 3 నుంచి 14 గంటలు ఉంటుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. అయితే కొత్తగా విస్తరించకుండా జనతా కర్ఫ్యూ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు బయట తిరగకపోవడం తో ఇతరులకు సోకదు. ఒకవేళ వైరస్ ప్రజల్లో ఉన్నా జనతా కర్ఫ్యూ వలన ప్రజలెవరూ బయటకు రాకపోవడం తో ఇతరులకు వ్యాపించే అవకాశమే లేదు.
ఇంట్లో ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండడం తో అక్కడే అది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుక్కోలేదు. మన సంకల్పం దృఢంగా ఉండాలి. కరోనాను నివారించడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. మనం స్వచ్ఛంగా ఉందాం. సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం. మరియు మనమంతా దృఢ సంకల్పంతో కలసికట్టుగా కరోనాపై పోరాడదాం. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించడం మీకు, మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో అవసరం. జనం కోసమే ఈ జనతా కర్ఫ్యూ. కాబట్టి.. స్టే హోమ్.. సేవ్ నేషన్..!!