ఇప్పుడన్నీ కరోనా కష్టాలే. లాక్డౌన్తో ఇంటికే పరిమితం అయిపోయిన పరిస్థితులే. లాక్డౌన్ పొడగిస్తారా అనే సందేహాలే. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ను పొడిగించనున్నారు అనే ప్రచారం కలవరపాటుకు గురిచేస్తోంది. లాక్డౌన్ను పొడిగించనున్నట్లు పలు మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో వెలువడిన వార్తలు అవాస్తవమని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబా ఈ మేరకు సోమవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రచారాలు, క్లారిటీలు ఇలా ఉంటే...తాజాగా ఓ చిత్రమైన దొంగతనం జరిగింది.
ఏటీఎంలలో ఎలాంటి దొంగతనాలు జరుగుతుంటాయి? డబ్బు దొంగతనాలే జరుగుతుంటాయి కదా? కానీ ఇదో చిత్రమైన దొంగతనం. ఓ యవకుడు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత... అక్కడున్న శానిటైజర్ను గమనించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎల్లప్పుడూ చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ శానిటైజర్ను ఉపయోగిస్తున్నారు. కానీ మార్కెట్లో శానిటైజర్ దొరకని పరిస్థితి. దీంతో ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు దాన్ని చొక్కాలో దాచుకుని వెళ్లిపోయాడు. ఇదంతా వీడియోలో రికార్డయింది. ఈ వీడియోను పాకిస్తాన్కు చెందిన నైలా ఇనయాత్ అనే జర్నలిస్టు తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, పాక్లోనే కాదు. ఇలాంటి ఘటనే ఇండియాలో కూడా జరిగిందట. ఓ నెటిజన్ వీడియోను పోస్టు చేశాడు. ఏటీఎంలో నగదు విత్డ్రా చేసుకునేందుకు వచ్చిన ఆ యువకుడు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుని.. దాన్ని ఎత్తుకెళ్లాడు.
ఇదిలాఉండగా, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనలో శానిటైజర్లకున్న ప్రాధాన్యం దృష్ట్యా భారత్ నుంచి విదేశాలకు వాటి ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రకాల వెంటిలేటర్ల ఎగుమతిపైనా నిషేధాజ్ఞలు తెచ్చింది. ఇప్పటికే సర్జికల్, డిస్పోజబుల్ మాస్క్లు, వీటి తయారీకి ఉపయోగించే ఉత్పత్తుల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్లకు విపరీతంగా డిమాండ్ ఉంది.