నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.. ప్రధానంగా నిజామాబాద్, బాన్సువాడల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 కు చేరింది. కాగా ఒక్క నిజామాబాద్ నగరంలోనే 19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. మరోపక్క బాన్సువాడలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్, బాన్సువాడల్లో ఇప్పుడు లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత బట్టి ప్రభుత్వం హాట్స్పాట్గా ప్రకటించే అవకాశం ఉంది. పాజిటివ్ కేసుల నమోదు, వైరస్ వ్యాపిస్తున్న తీరు, లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసుల నమోదు ఆధారంగా హాట్స్పాట్లుగా గుర్తిస్తారు. నిజామాబాద్, బాన్సువాడల్లో నె లకొంటున్న పరిస్థితులు అటు వైపే దారి తీస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవేళ హాట్స్పాట్గా ప్రకటిస్తే.. ఈ ప్రాంతాలకు నిర్ణీత దూరం వరకు ఇతరులను ఎవ్వరినీ అనుమతించరు. ఆయా ప్రాంతాల నుంచి వైరస్ వ్యాప్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.