కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. భౌతిక దూరాన్ని పాటించడం, తరుచూ చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం తదితర విధానాలతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన సూచిస్తున్నారు. న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్లను ముట్టుకోడానికి కూడా జనం జంకుతున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో రూ.500 నోటుతో ముక్కు తుడుచుకున్న వీడియో ఒకటి తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్గా మారడంతో గ్రామీణ ప్రాంతాల్లోని జనం హడలెత్తిపోతున్నారు. కరెన్సీ నోట్లను ముట్టుకోవడానికి కూడా జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో కర్ణాటకలోని మాండ్యా జిల్లా మరనచకనహల్లి గ్రామస్తులు దీనికో పరిష్కారం కనిపెట్టారు. రూ. 2000, రూ.500, రూ.100 నోట్లను నీళ్లలో కడిగి ఆరపెడుతున్నారు. తమ పంటలను అమ్మగా వచ్చిన డబ్బులను ఇలా శుభ్రం చేస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అంటున్నారు. కాగా ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.