ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా  సీఎం జగన్ ఏపిలో కరోనాని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కరోనావైరస్ మరింత వ్యాప్తిచెందకుండా ఉండేందుకు  రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు జగన్.

 

కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు   అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఇక, రాష్ట్రంలో మూడోసారి సర్వే పూర్తి అయినట్టు చెప్పారు అధికారులు.. కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 45 వేల మందికి పరీక్షలు చేసేందుకు వైద్య శాఖ సిద్దమైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందన్న సీఎం జగన్.. వీలైనంత త్వరగా మాస్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్ ఉండాల్సిందేనని సూచించిన ఏపీ సీఎం.. ఎక్కడా జనం గుమ్మికూడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: