కరోనా కలకలం నేపథ్యంలో ఇప్పుడు అందరిలో ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళ వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వేల మంది ఇస్లామిక్ మతస్థులతో ఢిల్లీలోని నిజాముద్దీన్లో గల మర్కజ్ బిల్డింగ్లో భారీ సమావేశాలను జరగడం, మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు దేశవ్యాప్తంగా వ్యాపించి...వారి నుంచే అధిక సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మందిలో టెన్షన్ సాగుతోంది. ఈ సమయంలో ఈ సమావేశాలు నిర్వహించిన తబ్లిగీ జమాత్ మర్కజ్ నేత మౌలానా సాద్ ఖందల్వి సంచలన నిర్ణయం వెలువరించారు.
ప్రజలను రెచ్చగొట్టి మర్కజ్ సమావేశాలను నిర్వహించినట్లు తబ్లిగీ జమాత్ మర్కజ్ నేత మౌలానా సాద్ ఖందల్వి పై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసును పెట్టారు. ఆ కేసులో సెక్షన్ 304ను కూడా జత చేశారు. ఐపీసీలోని కల్పబుల్ హోమిసైడ్ను కూడా అతనిపై బుక్ చేశారు. దీని కింద అత్యధికంగా పదేళ్ల జైలు శిక్షపడే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఆ సంస్థకు వస్తున్న నిధులపై విచారణ సైతం సాగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీ వరకు స్వీయ నిర్బంధంలో ఉన్న మౌలానా సాద్ తాజాగా ఇవాళ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. మర్కజ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నానని, ఆ విచారణలో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ లేఖలో ఖందల్వి తెలిపారు. మరోవైపు ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత ఖందల్వి ప్రత్యక్ష విచారణకు హాజరు అవుతారని ఆయన తరపున లాయర్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా నిజాముద్దీన్లోని మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్కు హాజరైన 46 మంది విదేశీయులకు జైలు శిక్ష విధించారు. బీహార్లోని మూడు జిల్లాల నుంచి వీరిని అరెస్టు చేశారు. వీసా రూల్స్ను వారు ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు. ఆ జాబితాలో మలేషియా, కర్గిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, కజకిస్తాన్ దేశాలకు చెందినవారున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. అరేరియా జిల్లాలో 18 మంది, పాట్నాలో 17, బక్సర్ నుంచి 11 మంది విదేశీయులను అరెస్టు చేశారు.