దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పూర్తి అదుపులోకి వస్తున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. కరోనా వల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కష్టాలు వచ్చి పడ్డాయి. కట్టడి అవుతుందని భావించే సమయంలో దీని ప్రభావం మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి ఈ నెల 20 తర్వాత కరోనా అదుపులోకి వస్తుందని.. లాక్ డౌన్ లో సడలింపు చేయాలని భావించారు. కానీ రోజూ కేసులు పెరిగిపోతూను ఉన్నాయి. మొన్నటి వరకు మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు లేవు.. కానీ నిన్న జిల్లాలోని ముత్తరావు పల్లి గ్రామంలో ఇటీవల ఓ మహిళ జ్వరంతో మరణించడం, అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ రావడం.. జిల్లాలో కలకలం సృష్టించింది.
దాంతో ఇప్పుడు అక్కడ కొత్త టెన్షన్ మొదలైంది. ఆ మహిళ కుటుంబీకులను మరికొంత మందిని గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వారి కుటుంబీకులను కలిసిన వారిని గుర్తించారు. హోం క్వారంటైన్లో ఉండాలని చేతిపై ముద్ర వేశారు. గత రెండ్రోజులుగా కొన్ని పల్లెల నుంచి కూరగాయలు, పాలు అమ్ముకొనేందుకు వచ్చే వారిని కూడా చెన్నూర్లోకి అనుమతించడం లేదు. ఇక్కడ లాక్ డౌన్ సీరియస్ గా పాటించాలని.. ఒకదశలో అన్నీ పూర్తిగా మూసి వేయాలని ఆంక్షలు విధించారు.
దుకాణాలు సైతం పూర్తిగా మూసి ఉంచుతున్నారు. ఎక్కువ మంది రోడ్లపైకి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా మృతి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందనేది అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు రక్త నమూనాలు తీసుకు వెళ్లారు. మరో మూడు రోజుల అనంతరం ఆ రిపోర్ట్లు రానున్నాయి. అప్పటి వరకు చెన్నూర్ మండలం భయం గుప్పిట్లో ఉండాల్సిందే. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు మాత్రం చెన్నూర్ లో హై అలర్ట్ ప్రకటించారు.