తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబు తన అనుభవానికి తగిన రీతిలో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రపంచం అంతా కరోనాకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందని, ఇలాంటి వాతావరణంలో హుందాతనంతో కాకుండా రాజకీయాలే ముఖ్యమని బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విలువలులేని, మానవతా విలువలు, కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్రప్రభుత్వాన్ని ఇటు రాష్ర్ట ప్రభుత్వాన్ని దూషిస్తూ మానవజాతికే కీడు తెస్తున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ``చంద్రబాబునాయుడు అధికారం పోయినప్పటికి కూడా తనే ముఖ్యమంత్రిని అనుకుంటాడు. ఒక భ్రాంతికి లోనవుతాడు. తనే ముఖ్యమంత్రిని అనుకుని వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు. జూమ్ కాన్ఫరెన్స్ లు పెడతాడు. తను సలహాలు ఇవ్వబట్టే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అంటారు. రోజుకో లెటర్ రాస్తాడు. తను నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లలో కొంతమంది తనకు కావాల్సిన వారిని పిలిపించుకుంటాడు. కోమటి జయరామ్ అని తీసేసిన తహసిల్దార్ ఒకాయన అమెరికా నుంచి, అలాగే బ్రిటన్,ఆస్ర్టేలియా లనుంచి అలాంటివారంతా పాల్గొంటుంటే వారికి చంద్రబాబు ఆదేశాలు ఇస్తుంటాడు. ఇదంతా తన టైమ్ వేస్ట్ చేస్తున్నాడు.తను ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ఆంధ్ర రాష్ర్ట ప్రజలకు ద్రోహం చేస్తున్నాడనే విషయం మరిచిపోయి రాక్షస ప్రవర్తన చేస్తుంటాడు. ఇది శోచనీయం.` అని మండిపడ్డారు.
చంద్రబాబు అనే వ్యక్తి చంద్రముఖిగా ఎందుకు మారిపోయాడు అనే అనుమానం వచ్చిచాలామంది డాక్టర్లను,సైకియాటిస్ట్ లను, మేధావులను అడగడం జరిగిందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``బాబు ఎందుకు అబధ్దాలు చెబుతున్నాడు? ముఖ్యమంత్రిపై ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నాడు? ఎందుకు ఇలా చంద్రబాబు రాక్షసప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడనే అంశంపై చర్చించడం జరిగింది. మీరు ముత్యాలముగ్గు సినిమా చూసి ఉంటారు. చుట్టూ ఉన్నవారు ప్రతి దానికి డప్పు కొడుతుంటారు. ఆ రకంగా ముత్యాల ముగ్గు బృందం...తమరే సీఎం సార్... మీకన్నా ఈ దేశంలో మించిన సిఎం ఎవరూ లేరు సార్ అంటూ వాళ్లు డప్పుకొట్టి పొగుడుతూ ఉంటే తను ఆనందపడిపోతుంటాడు.` అని వ్యాఖ్యానించారు.